వికారాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వానకాలం సీజన్కుగాను వరి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. దీంతో జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లావ్యాప్తంగా 125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్కు సంబంధించి 96,701 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయింది. రైతులకు సత్వరమే చెల్లింపులు జరిగేలా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్మిల్లులకు సరఫరా చేసి బిల్లులు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మద్దతు ధరకు సంబంధించి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.2060, సాధారణ రకం రూ.2040గా ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలం సీజన్కుగాను 75వేల మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, 96,701 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఐకేపీ ద్వారా 23,719 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ద్వారా 38,316., డీసీఎంఎస్ ద్వారా 27,144., ఏఎంసీ ద్వారా 4608, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 2913 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
96,701 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను పీఏసీఎస్ ఆధ్వర్యంలో 58, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, ఏఎంసీ ఆధ్వర్యంలో 7, ఐకేపీ ఆధ్వర్యంలో 29, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. 4-5 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకొని రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో మొత్తం 17,616 మంది రైతుల నుంచి 96,701 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. రూ.199 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా, వీటిలో ఏ గ్రేడ్ రకం 96,562 మెట్రిక్ టన్నులుకాగా, సాధారణ రకం 138 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మొత్తం 96,701 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించారు. మరోవైపు జిల్లాలో 59 గోదాంలలో ధాన్యాన్ని నిల్వ ఉంచారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు నాలుగు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ వానకాలం సీజన్లో రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు, ఎక్కువగా పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో అధికంగా సాగు చేశారు.
సత్వరమే చెల్లింపులు : విమల, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. ఇప్పటివరకు సేకరించిన రూ.199 కోట్ల చెల్లింపులకు సంబంధించి ఇప్పటివరకు 198.17 కోట్ల చెల్లింపులు పూర్తికాగా, మిగతా పెండింగ్ చెల్లింపులు రెండు, మూడు రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.