వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు
టీబీ టెస్టులు పెంచాలని వైద్యాధికారులకు ఆదేశాలు
వికారాబాద్, జూలై 28, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ అధికారులతో టీబీ, లెప్రసీ, డెంగీ, మధుమేహం, హైపర్ టెన్షన్, మాత , శిశు సంరక్షణ, ప్రసవాల పురోగతిపై పీహెచ్సీల వారీగా సమీక్షించారు. ఆశవర్కర్లతో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు వారికి వైద్య సేవలందించాలని సూచించారు. టీబీ టెస్టులు పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 61 లెప్రసీ కేసులు నమోదు కాగా, 13 మందికి పూర్తి చికిత్సలు అందించినట్లు చెప్పారు. దీనికి 6నుంచి 9 నెలల వరకు పూర్తి చికిత్స అందిస్తామని చెప్పారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే వ్యాధి పూర్తిగా తగ్గేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 డెంగీ కేసులు నమోదుకాగా, వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను చురుకుగా చేపట్టడం వల్ల డెంగీ, సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు 9,604 మంది ఉండగా, హైపర్ టెన్షన్ కేసులు 19 వేలు ఉన్నాయన్నాయని తెలిపారు. మధుమేహ, బీపీ వ్యాధిగ్రస్తులను సబ్ సెంటర్ల వారీగా, ఇంటింటి సర్వే నిర్వహించి వారికి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో లక్ష్యాల మేరకు ప్రసవాల సంఖ్యను పెంచాలని, సాధ్యమైనంత వరకు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. మాతా, శిశు సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో సుధాకర్షిండే, డిప్యూటీ డీఎంహెచ్వో జీవరాజ్, వైద్యాధికారులు లలిత, అరవింద్, ప్రోగ్రాం ఆఫీసర్ మారియా, పీహెచ్సీల వైద్యులు పాల్గొన్నారు.