పుంజుకుంటున్న ఆర్టీసీ ఆదాయం
29 రోజుల్లో రూ.5.16కోట్లు
ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు
అన్నిరూట్లలో నడుస్తున్న బస్సులు
వికారాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టడం.. జనజీవనం సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్యగా రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో కొంతకాలంగా ఆర్టీసీకి భారీ రాబడి వస్తున్నది. ఈ నెల 1 నుంచి 29వ తేదీ వరకు జిల్లా పరిధిలో రూ.5.16కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రూట్లలో అధికారులు బస్సులు నడుపుతున్నారు. దీంతో మంచి ఆదాయం వస్తున్నది.
ఆర్టీసీ ఆదాయం పుంజుకుంటున్నది. ఈ నెల 1 నుంచి 29వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా పరిధిలో రూ.5.16 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక వైపు కరోనా.. మరోవైపు లాక్డౌన్తో ఇటీవల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో జనజీవనం సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించేవారు గణనీయంగా పెరుగుతున్నారు. లాక్డౌన్తో నష్టపోయిన ఆర్టీసీ ప్రస్తుతం తమ బస్సులను పూర్తిస్థాయిలో నడిపిస్తుండడంతో నష్టాల నుంచి గట్టెక్కుతూ ఆదాయం కొంతవరకు మెరుగుపరుచుకుంటున్నది. 45 రోజుల తర్వాత అధికారులు కొంతవరకు ఊపిరిపీల్చుకున్నారు.
అద్దె బస్సులకు అనుమతి లేదు..
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు డిపోల్లో అద్దె బస్సులు 138 ఉన్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ఆర్టీసీ సంస్థకున్న 125 బస్సులను వివిధ రూట్లలో నడుపుతున్నారు. మిగిలిన కొన్ని బస్సులు ఆయా డిపోల్లోనే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ప్రధాన రూట్లకు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో రోజూ రూ.18లక్షల నుంచి 22 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. మూడు డిపోల పరిధిలో 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 28.27లక్షల కిలోమీటర్లు తిరుగగా.. రూ.5కోట్ల16లక్షల21వేల వరకు ఆదాయం వచ్చింది ఆక్యుపెన్సీ రేషియో 74.37 వరకు ఉంది. ఆగస్టు నెలలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైతే అద్దె బస్సులకు కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రతి రోజూ ఆర్టీసీకి రూ.18లక్షల నుంచి 22 లక్షల వరకు ఆదాయం
ప్రతి రోజూ మూడు డిపోల పరిధిలోని 125 బస్సులు 51వేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ ఆర్టీసీకి రూ.18లక్షల నుంచి 22 లక్షల వరకు ఆదాయం చేకూరుతున్నది. పరిగి డిపోకు చెందిన 42 బస్సులు 18వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించి రూ.6.50 లక్షలు, తాండూరు డిపోకు చెందిన 52 బస్సులు 20వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించి రూ.7.10 లక్షలు, వికారాబాద్ డిపోకు చెందిన 31 బస్సులు 13వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించి రూ.4.50 లక్షల ఆదాయం తీసుకువచ్చాయి.
రద్దీ పెరిగింది : రమేశ్, డీవీఎం, వికారాబాద్ జిల్లా
లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగింది. ప్రస్తుతం అద్దె బస్సులను మినహాయించి సంస్థ బస్సులను పూర్తిస్థాయిలో నడిపిస్తున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఆగస్టులో విద్యాసంస్థలు ప్రారంభమైతే అద్దె బస్సులను కూడా పూర్తిస్థాయిలో నడిపిస్తాం. ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు కార్మికులు కృషి చేస్తున్నారు.