చేవెళ్ల రూరల్,నవంబర్ 3: పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛతకు మారుపేరుగా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మారుపేరుగా నిలుస్తున్నది. పాఠశాల ఆవరణ వివిధ రకాల చెట్లతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఎలాంటి చెత్త చెదారం కనిపించదు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల దినదినాభివృద్ధి చెందుతున్నది.
పాఠశాలకు రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం..
పచ్చదనం, పరిశుభ్రతకు చిహ్నంగా మారిన కందవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాల పురస్కారం లభించింది.
మొక్కలు నాటి.. వాటి సంరక్షణ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ఉపాధ్యాయులు, విద్యార్థులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలో ఇప్పటి వరకు 500 మొక్కలు నాటారు.
అవగాహన..
ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శించి పచ్చదనం, పరిశుభ్రత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థుల ప్రత్యేక శ్రద్ధతో..
మొక్కల పెంపకంతోనే వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని భావించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. నేడు ఆ మొక్కలే ఏపుగా పెరిగి పచ్చని చెట్లతో పాఠశాల ఆవరణ హరిత పందిరిగా మారింది. రకరకాల మొక్కలు మొక్కలు ఉన్నాయి. పచ్చదనం అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తోంది.
– నరేంద్ర బోగం, కందవాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు