ధారూరు : అభివృద్ధి బాటలో గ్రామ పంచాయతీలు పయణం అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ధారూరు మండల పరిధిలోని రాజాపూర్లో మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యాటించి గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను వెంటనే సరి చేసి, అవసరమైన చోట నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలన్నారు.
రాజాపూర్ పరిసర ప్రాంతాలకు లక్నాపూర్ ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టు ఎడమ కాలువకు మరమ్మతు లు చేపట్టి సాగునీరు అందించాలని, రాజాపూర్ గ్రామ సమీపంలోని చెరువును మరమ్మతులు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ మరుగు దొడ్లను నిర్మించుకోవాలని ప్రజలకు సూచిస్తూ అందుకు పంచాయతీరాజ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రధానమైన రోడ్లు, మురుగు కాలువలు సమస్యలకు నిధులు కేటాయించి నూతనంగా రోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ధారూరు జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్రెడ్డి, నాయకులు కావలి అంజయ్య, రాములు, రాజుగుప్తా, విజయ్కుమార్, లక్ష్మయ్య, దేవేందర్, శ్రీనివాస్, చంద్రమౌళి, శ్రీశైలం, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.