పరిగి : పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 72మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సర్కారు ద్వారా ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరాలన్నా పైరవీకారుల చేతులు తడపాల్సి వచ్చేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైరవీలకు ఆస్కారం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.
నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందిస్తుండడంతో పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వృద్ధాప్య పింఛన్లు 57ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే అందనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, వైస్ ఎంపీపీ సత్యానారాయణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, డిప్యూటి తాసిల్దార్ నర్సింహారెడ్డి, ఆర్ఐలు వెంకట్రాంరెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.
మార్కెట్యార్డులో అభివృద్ధి పనులు
పరిగి మార్కెట్యార్డులో సుమారు రూ. 2కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 17 దుకాణాల సముదాయం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, రోడ్డు వైపు సైతం దుకాణాలతో అద్దె రూపంలో ఆదాయం పెరుగుతుందన్నారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి పరిగి నియోజకవర్గానికి చెందిన గ్రామాలు పరిగి మార్కెట్ పరిధిలోని మార్పు చేయించడం జరుగుతుందని, తద్వారా రెండు జిన్నింగ్ మిల్లులతో మార్కెట్ ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
మార్కెట్ యార్డులో అంతర్గత సీసీరోడ్లు వేయిస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ సదుపాయం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కేంద్రం నల్ల చట్టాలు తీసుకువచ్చి మార్కెట్ కమిటీలను ఎత్తేయాలని ప్రయత్నించిందని, రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం జరిగిందన్నారు. మార్కెట్ చైర్మన్ సురేందర్ మాట్లాడుతూ రైతుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి భవనం నిర్మాణం చేపడుతామని తెలిపారు. దుకాణాల సముదాయం, ఇతర సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ సమీర్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.