వికారాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని, నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బంధవుడు సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు బూర్గుపల్లిలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా వేదికపై రైతులను కూర్చోబెట్టి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటకు పెట్టుబడి సాయంగా 63 లక్షల కుటుంబాలకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు దఫాల వారీగా రూ. 50వేల కోట్ల రైతులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రైతుబీమా, ఉచిత కరెంట్, సాగు నీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం అధిక మోతాదులో వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రైతులు రైతుబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు.
అనంతరం వికారాబాద్ పట్టణం హిందూ జనశక్తి ఆధ్వర్యంలో మాణిక్ భక్త బృందం ప్రభునగర్ వారు నిర్వహించిన అనంతగిరి ప్రదక్షణలో పారల్గొన్నారు. శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, కౌన్సిలర్ అనంత్రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.