తాండూరు : ఆరోగ్యమే మహాభాగ్యమని అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలో రూ. 26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, కలెక్టర్ నిఖిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. తాండూరులో రూ. 20కోట్లతో పూర్తయిన మాతాశిశు ఆస్పత్రి రూ. 3.47కోట్లతో పూర్తయిన మున్సిపల్ భవనం, రూ. 2.25కోట్లతో పూర్తయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంతో పాటు రూ. 20లక్షలతో మున్సిపల్ పరిధిలోని సాయిపూర్లో అంగన్వాడీ భవనం, రూ. 50లక్షలతో పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అదే విధంగా అర్హులైన లబ్ధిదారులకు మల్రెడ్డిపల్లి ఫంక్షన్హాల్లో 1.65 కోట్ల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య, వైద్యం అందుతుందన్నారు. అందుకు తగ్గట్లు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాల, కళాశాలలతో పాటు ఆస్పత్రుల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి కావాల్సి మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు విధిగా బాధ్యతతో పాల్గొనాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కాలుష్యం తాండూరులో ఉందని అందుకు తగ్గట్లు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీలో గ్రీన్ బడ్జెట్కు కేటాయించిన నిధులతో గ్రీనరీలు, నర్సరీలతో పాటు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ గతంలో తెచ్చిన నిధులతో పాటు మరిన్ని ప్రత్యేక నిధులతో తాండూరులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలలో కావాల్సిన సదుపాయాలన్ని సమకురుస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అఖిల సబ్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో అశోక్కుమార్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మురళీకృష్ణగౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షలు, సీనియర్ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.