నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. లోన్యాప్, లక్కీ స్కీం, మీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో పొంచి ఉన్న ప్రమాదాన్ని పోలీసులు వివరిస్తున్నారు. స్త్రీల రక్షణ కోసం షీ టీమ్స్ తీసుకునే చర్యలు, అండదండలపై విద్యార్థినుల్లో అవగాహన పెంచుతున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తే వెంటనే షీ టీమ్స్కు సమాచారం ఇవ్వడంతో పాటు ఎలా స్పందించాలన్న దానిపై చైతన్యం కలిగిసున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగడం వల్ల సైబర్ కేటుగాళ్ల మోసాలు పెరిగాయని… జిల్లాలో నెలకు 15-20 సైబర్ క్రైం కేసులు నమోదవుతున్నాయని జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంటున్నది. నేరాలకు కళ్లెం వేసేలా పోలీసులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవపై విద్యార్థులు ప్రశంసల జల్లులు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ): మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు, మోసాలు కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు జరిగిన దారి దోపిడీలు, దొంగతనాలు, పిక్ ప్యాకెట్ వంటి నేరాలు ప్రస్తుతం తక్కువగా నమోదవుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో నేరగాళ్లు కొత్త తరహా నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాయి. జిల్లాలో నెలకు 15-20 సైబర్ నేరాలు జరుగుతున్నట్లు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఈ నేరాల్లో ఎక్కువగా ఓటీపీ ఆధారంగా చేస్తున్నవేనని పోలీసులు గుర్తించారు. మరోవైపు పిల్లల మొదలు పెద్దల వరకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన దృష్ట్యా జిల్లాలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహన, కేసుల నమోదు తదితర కార్యకలాపాల నిర్వహణకుగాను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైబర్ ల్యాబ్ను జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేక నజర్ పెట్టి యాక్టివ్గా పనిచేసేలా ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.
స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన..
సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా వాటి బారిన పడకుండా జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు, ఊర్లలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నెలకు 200 వరకు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లతోపాటు జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా వివరిస్తున్నారు. ఓటీపీ, వివిధ లింక్ల ద్వారా సైబర్ నేరాలు, లోన్ యాప్స్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ చేస్తున్న సెక్స్ టార్షన్పై విద్యార్థులు మోసపోకుండా తెలిసేలా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న హైస్కూల్ తరగతులు విద్యార్థులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు కాబట్టి ఏ యాప్ను పడితే ఆ యాప్ను వినియోగించకుండా ఉండేందుకు విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏదో రకంగా అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దృష్ట్యా పిల్లల్లో సైబర్ క్రైమ్స్పై అవగాహన కలిగేలా జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అవగాహనతోనే సైబర్ నేరాలు కట్టడి : ఎస్పీ కోటిరెడ్డి
అవగాహనతోనే సైబర్ నేరాలు, మోసాలను కట్టడి చేయొచ్చు. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దు. మీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందంటూ.. ఇప్పుడు కొత్తగా సెక్స్ టార్షన్ పేరిట యువతను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి ఫోన్ చేసినట్లయితే మీ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును ఇతర ఖాతాల్లోకి డెబిట్ కాకుండా చర్యలు తీసుకుంటాం.
జిల్లా అంతటా ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం
– జిల్లా సైబర్ క్రైమ్స్ సీఐ శ్రీనివాస్రావు
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన దృష్ట్యా సైబర్ నేరాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల నిమిత్తం ఫోన్లను వినియోగిస్తున్నారు.. వీరినే టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన ఉంటే ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చినా స్పందించరు. అందుకే జిల్లా అంతటా హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నాం. ఈ మధ్యన లోన్ యాప్స్, సెక్స్ టార్షన్లతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా జిల్లావ్యాప్తంగా చైతన్యపరుస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా కూడా సైబర్ మోసాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివరాంనగర్ కాలనీకి చెందిన యువకుడు లోన్యాప్ ద్వారా రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న రూ.10వేలకు బదులుగా సదరు యువకుడు ఏకంగా రూ.4 లక్షలకుపైగా చెల్లించాడు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించిన వెంటనే మళ్లీ చెల్లించిన డబ్బుకు మించి తిరిగి ఆన్లైన్ ద్వారా అప్పుగా లోన్యాప్ నిర్వాహకులు ఇచ్చి.. ఒకవేళ వడ్డీతోపాటు చెల్లించకపోతే న్యూడ్ ఫొటోలు మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే బాధితుడు రూ.4లక్షలకుపైగా చెల్లించినా లోన్యాప్ నిర్వాహకుల ఆరాచకం మితిమీరడంతో చివరకు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. సమస్యను పరిష్కరించారు.
ఇటీవల పూడూరు మండలం చన్గోముల్ గ్రామానికి చెందిన విద్యార్థిని సైబర్ నేరగాళ్ల బారిన పడింది. మీ బ్యాంకు ఖాతా నిలిచిపోయిందని.. వెంటనే బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్కార్డు నంబర్లను పంపాలని సైబర్ నేరగాళ్లు వేసిన వలకు చిక్కుకోవడంతో తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.9లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. అప్పటికే సంఘటన జరిగి రెండు, మూడు నెలలు కావడంతో కేసు నమోదు చేసుకున్నప్పటికీ పోలీసులేమీ చేయలేకపోయారు.
కోట్పల్లి మండలం రొంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల మోసంతో రూ.40వేలు నష్టపోయాడు. మీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందంటూ వచ్చిన ఫోన్ కాల్కు స్పందించి తన ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.70వేలు మరో ఖాతాకు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే స్పందించి సైబర్ క్రైం పోలీసులకు సమాచారమివ్వడంతో సదరు యువకుడి ఖాతాను ఫ్రీజ్ చేసి అప్పటికే రూ.40వేలు ఇతర ఖాతాకు బదిలీకాగా, మిగిలిన రూ.30వేలు రిటర్న్ సదరు యువకుడి ఖాతాలో జమ అయ్యేలా చేశారు.