వికారాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని…రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి.. వికారాబాద్ ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్ను మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు విన్నవించారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆనంద్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు ఎందుకు కలిసి ఉండాలని అన్నట్లు ఆయన గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం కాబట్టే అప్పుడు మనకు డిగ్రీ కాలేజీ వచ్చిందన్నారు. అదేవిధంగా ఈ రోజు సీఎం ఆశీర్వాదంతోనే వికారాబాద్కు మెడికల్ కాలేజీ మంజూరైందని… వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 250 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నామని, జూలై, ఆగస్టు నెలల్లోగా 600 పడకల దవాఖాన అందుబాటులోకి వస్తుందని.. పెద్ద రోగం వస్తే హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదన్నారు. రాబోయే రెండు నెల ల్లో ఎంబీబీఎస్ విద్యార్థులూ వస్తారని, జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మూడు ఆయుష్ దవాఖానలు మంజూరు కాగా.. ఎమ్మెల్యే ఆనంద్ పట్టుపట్టడంతో వికారాబాద్కు ఆయుష్ దవాఖాన వచ్చిందన్నారు.
అదేవిధంగా జిల్లాకు సిటిస్కాన్, టిఫా స్కాన్లను కూడా మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పంపుల పనులు పూర్తయ్యాయని, కర్వెన, ఒట్టెం రిజర్వాయర్ల నుంచి కృష్ణానీటిని తీసుకొచ్చి వికారాబాద్ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. జిల్లాలో చాలా అభివృద్ధి జరగాలని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు సూచించారు. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో వచ్చిన మా ర్పును ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భూముల విలువ పెరిగిందని, మర్పల్లిలో గతంలో ఎకరం రూ.3 లక్ష లు పలకగా.. ప్రస్తుతం రూ.కోటి వరకు ఉందన్నారు. అదేవిధంగా మర్పల్లి మండల కేంద్రానికి నాలుగు లేన్ల రోడ్డు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని, పార్టీ అధినేత ఎవరిని సూచిస్తే వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్క రూ చూసేది సీఎం కేసీఆర్, గులాబీ జెండాను మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం గురించి మాట్లాడుతూ తరలివచ్చిన జన సందోహంతో విజయోత్సవ సభలా మారిందన్నారు.
భారీగా హాజరైన జనం..
మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనానికి భారీగా జనం తరలివచ్చారు. సు మారు 13వేల మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి గులాబీ పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా అంతకుముందు మోమిన్పేట మండల కేంద్రం నుంచి మర్పల్లి మం డల కేం ద్రం వరకు భారీ బైక్, కారు ర్యాలీలను నిర్వహించా రు. దీంతో ఆ ప్రాంతమం తా గులాబీమయంగా మా రింది. అనంతరం మో మిన్పేట మం డలంలోని చీమలదరి గ్రామం జా తీయ ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకున్న సందర్భంగా సర్పంచ్ నర్సింహారెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సుశీల్కుమార్ గౌడ్, మర్పల్లి జడ్పీటీసీ మధుకర్, పార్టీ మండలాధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీ సంగీతా వసంత్, ఉప సర్పంచ్ రాజు, మర్పల్లి, మోమిన్పేట మండలాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆయుష్ దవాఖాన, సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ నిర్మాణాలకు శంకుస్థాపన
వికారాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ నిర్మాణాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, కాలె యాదయ్యలతో కలిసి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ 280 పడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయన అనంతగిరిగుట్టలోని అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, వైద్యారోగ్య శాఖల డైరెక్టర్ రమేశ్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, డీఎంహెచ్వో డాక్టర్ పల్వన్కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, వైస్ చైర్పర్సన్ శంషద్ బేగం, జడ్పీ వైస్చైర్మన్ విజయ్కుమార్, అనంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో మంత్రికి ఘన స్వాగతం
చేవెళ్లటౌన్, ఏప్రిల్ 13 : వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఆయుష్ దవాఖాన, కేంద్రీయ ఔషధ నిల్వ కేం ద్రానికి శంకుస్థాపన.. మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు చేవెళ్ల మీదుగా వికారాబాద్కు వెళ్తున్న వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావుకు ఘన స్వాగతం లభించింది. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఆత్మీయ సమ్మేళనాలు ఎలా జరుగుతున్నాయని ఎమ్మెల్యే యాదయ్యను అడుగగా.. షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల్లో దాదాపుగా అయిపోయాయని.. చేవెళ్ల మండలంలో ఉన్నాయని వాటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, ప్రభాకర్, కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, నరహరిరెడ్డి, శ్రీనివాస్, మాణిక్యారెడ్డి, శేఖర్, రాములు, సాయికుమార్ పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పక్క రాష్ర్టాల్లో ఏమి అభివృద్ధి జరుగుతున్నది.. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి ఆలోచించాలని ఆయన ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లో రానున్న ఎన్నికల్లో గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఓటుకు నోటు దొం గను తీసుకొస్తే, బీజేపీ పేపర్ లీకేజీ దొంగను తీసుకొచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం గురించి కొందరు మాట్లాడుతున్నారని, 20 ఏండ్లు ఉద్యమంలో ఉన్నప్పు డు ఆయన కుటుంబం ఎందుకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం కాంగ్రెస్, బీజేపీ లు చేస్తున్నాయన్నారు. పార్టీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలుంటే కుటుంబ సభ్యులుగా చర్చించి పరిష్కరించుకోవాలని, సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే సీఎం, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
– పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ
ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అందుతున్నది..
ప్రతి ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదో ఒక పథకం అందుతున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. గులాబీ కండువాకు తప్ప ఏ కండువా వేసుకున్న వారికీ ఓటు అడిగే హక్కు లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను గురి చేస్తున్నదన్నారు. ఆడబిడ్డలకు మేనమామలా కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాలతో రూ. లక్షా 116 అందిస్తున్నారని, రైతులకు పంట పెట్టుబడికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి నీళ్లు వస్తే వికారాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులతో పనులను చేయిస్తున్నదని.. ఆ పనులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేని వాళ్లు ఈ రోజు తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉంటేనే మన బతుకులు బాగుంటాయని గుర్తు చేశారు. – డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
అభివృద్ధి పథంలో గ్రామాలు
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తప్పా మిగతా పార్టీలకు ఓటు హక్కు అడిగే హక్కు లేదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లల్లో చేసి చూపించారని కొనియాడారు. ప్రతి గ్రామం అభివృద్ధితో కళకళలాడుతున్నదన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ, తాండూరుకు నర్సింగ్ కాలేజీ, మాతా,శిశు సంరక్షణ దవాఖానను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరింత అభివృద్ధి జరుగడం ఖాయమన్నారు. కోట్పల్లి ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నా రు. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన జనాన్ని చూసి ఆయన విజయోత్సవ సభలా ఉందని పేర్కొన్నారు.
– పైలెట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే