కులకచర్ల : అనారోగ్యంతో వివాహిత మృతి చెందిన సంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన వడ్డె తిర్మలయ్య కుమార్తె వడ్డె అలవేలు (21) గత 18నెలల క్రితం మహ్మాదాబాద్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన వడ్డె లాలుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత అలవేలుకు పసిరికలు వచ్చాయని, అత్తవారు ఆస్పత్రికి చూపించలేదన్నారు. వారం రోజుల క్రితం తన బిడ్డను కులకచర్లకు తీసుకొచ్చి ఆస్పత్రికి చూయించినట్లు తండ్రి తిర్మలయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అనారోగ్యంగా ఉన్న అలవేలుకు భర్త లాలు, అత్త హన్మమ్మ, మరిది రాములు, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించారని, వేధింపులు తట్టుకోలేకనే తన కుమార్తె మానసికంగా, అనారోగ్యానికి గురైందని తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.