పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 137 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు శుభ్ర పరుచుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన ఖాళీ బస్తాలు, టార్బాలిన్లు, తూకం యంత్రాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
రైతులు తప్పనిసరిగా వ్యవసాయాధికారుల వద్ద టోకెన్లు తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను సంప్రదించి రైతులు నష్టపోరాదని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా సహకార అధికారి సుజాత పాల్గొన్నారు.