కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శిరీషాకి రూ. 18 వేలు, కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన పరమేశ్వరిగౌడ్కి రూ. 1 లక్ష విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికి వరంలా మారిందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్సీ వివరించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని వివిధ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కడ్తాల్ పట్టణానికి చెందిన బాలయ్యని, తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన వీరమణిని ఎమ్మెల్సీ పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.