యాలాల : తప్పిపోయి వచ్చిన బాలికను సఖీ కేంద్రానికి తరలించిన సంఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చత్తీస్ఘడ్ రాష్ట్రం దుర్గ జిల్లా బిలాయి ప్రాంతానికి చెందిన హీనా(13) తండ్రి రాము, తల్లి బైసియా ఇంట్లో చెప్పకుండా ఐదు రోజుల క్రితం వారి గ్రామం స్మృతి నగర్ ప్రాంతం నుంచి రైల్లో తిరుగుతూ శనివారం సాయంత్రం తాండూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లి వదలి వెళ్లిపోయింది. తండ్రి కూలీ పని చేస్తాడు. ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాను, ఇద్దరు అక్కలు, అన్న ఉన్నాడని చెప్పింది.
బాలిక అందించిన వివరాలతో ఆయా ప్రాంతాల్లో వివరాల కోసం ప్రయత్నించగా పూర్తి సమాచారం తెలియరాలేదు. దీంతో బాలిక వసతి కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించడంతో వికారాబాద్ సీడబ్ల్యూసీ సమాచారం మేరకు వికారాబాద్ సఖీ కేంద్రానికి తరలించారు.