పరిగి : వికారాబాద్ జిల్లాలో 59మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 59 మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 9, గౌడ్లకు 6, ఎస్టీలకు 2 దుకాణాలు రిజర్వు చేయబడ్డాయని అన్నారు. 21 సంవత్సరాలు నిండిన వారు మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు కేటాయించిన దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు తాసిల్దార్చే జారీ చేయబడిన కులం సర్టిఫికెట్ను దరఖాస్తుకు జత చేయాలన్నారు.
రూ. 2లక్షలు చలానా లేదా డీడీని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరిట తీయాలని, 3 ఫోటోలు, పాన్కార్డు, ఆధార్కార్డు జీరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈనెల 18వ తేదీ వరకు వికారాబాద్లోని స్త్రీశక్తి భవన్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈనెల 20వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు అంబేద్కర్ భవన్లో డ్రా తీయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో రూ. 60లక్షలు స్లాబ్లో 17 మద్యం దుకాణాలు, రూ. 55లక్షల స్లాబ్లో 28 దుకాణాలు, రూ. 50లక్షల స్లాబ్లో 14 దుకాణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
దుకాణం టర్నోవర్ 10 రెట్లు దాటిన తర్వాతే ట్యాక్స్ ఉంటుందన్నారు. బ్యాంకు గ్యారంటీ సంవత్సరం స్లాబ్పై 25శాతం ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ మద్యంపై 27శాతం, మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20శాతం మార్జిన్ ఉంటుందన్నారు. అన్ని దుకాణాలలో వాక్ ఇన్ సదుపాయం కల్పించడం జరుగుతుందని, తద్వారా వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ తీసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.