వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికి బదులుగా ఇతర పంటలు సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి మాట్లాడుతూ యాసంగిలో పండించే వరి పంటను కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా కొనుగోలు చేయరాదని స్పష్టంగా తెలిపిందన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా క్లస్టర్ల వారిగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు తెలిపారు. దీనికి బదులుగా పామ్ ఆయిల్ పంట చాలా లాభదాయకమని తెలిపారు.
లక్ష కోట్ల ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నామని, అతి త్వరలో జిల్లాలో ఫామ్ ఆయిల్ పరిశ్రమను చేయనున్నామన్నారు. జనవరి మాసం వరకు జొన్న, పెసర, మినుములు, నువ్వుల పంటలను వేసుకొనేందుకు వీలు పడుతుందని పేర్కొన్నారు. అందరు ఒకే రకం పంట కాకుండా వేరు వేరు పంటలు పండించుకుంటే లాభదాయకమని వివరించారు. ప్రతిసారి ఒకే పంట పండిస్తే భూసారం తగ్గుతుందని, మధ్యలో గ్యాప్ ఏర్పడి ఇతర పంటలు వేసుకుంటే మంచి డిమాండ్తో అధిక లాభాలు చేకూరుతాయన్నారు. రైతులు ఆరుతడి పంటలు పండించేందుకు సిద్ధంగా ఉంటే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వరినారు వేయలేదని తెలిపారు. గ్రామాల్లో రైతులు ఇతర పంటలు పండించేందుకు సిద్ధమయ్యారని, వారికి పంట మార్పిడిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫామ్ ఆయిల్ పంటలు అధికంగా పండించడంతో రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70వేల ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, బొమరాస్పేట మండలంలో ఎక్కువగా 10వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందన్నారు. ఈ 70వేల ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు సూచించారు.
ప్రతి గ్రామం, హాబిటేషన్లలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్వవసాయాధికారి గోపాల్, మండల వ్యవసాయ అధికారులు, హార్టీకల్చర్ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు పాల్గొన్నారు.