పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ పేరిట బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేదరికం వల్ల కొంతమంది చిన్నారులు చిన్న వయసులోనే కూలీ పనులకు వెళ్లడం చూస్తున్నామని, దీనికి కారణం నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితులేనని కారణమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆయన సూచించారు. బాల్య వివాహాలు ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయని, వాటి నిర్మూలనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.
కరోనా కాలంలో చాలామంది పిల్లలు అనాధలుగా మారిపోయారని, వారికి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి మాట్లాడుతూ అనాధ పిల్లలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న హోంలు, అలాగే ప్రభుత్వంచే నిర్వహిస్తున్న హోంలలో పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతి కల్పించడం జరిగిందన్నారు. కొవిడ్ కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమ శాఖ తరపున స్పాన్సర్షిప్ కార్యక్రమం కింద నెలకు రూ. 2వేలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పిల్లల విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా తమ శాఖ తరపున ఎల్లప్పుడు సహకారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా బాలరక్షా భవన్ కో-ఆర్డినేటర్ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ తరపున పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహిస్తున్న హోమ్లలో అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి కోఠాజీ, డీవైఎస్వో హన్మంతరావు, వైద్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ లలితకుమారి, కేర్ ఇండియా రాష్ట్ర కో-ఆర్డినేటర్ అరుణ, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.