జిల్లాలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాధార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలు సాగు చేసిన పొలాల నుంచి మురుగు నీటిని తొలగించాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నదాతలకు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన పంటల సస్యరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు.
వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ను పైపాటుగా 20 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్లలో 7-10 సెం.మీ దూరంలో పాదులు తీసి ఎరువులు వేసి మట్టితో కప్పాలి. పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 10 గ్రాముల మల్టీ-కే(13-0-45) లేదా 20 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. చీడపీడల ఉధృతి పెరుగడకుండా 2.5 గ్రాముల కార్బెండిజమ్+ మాంకోజెబ్ లేదా 2 మి.లీ పిఫ్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల పత్తిలో వడలు తెగులు సోకుటకు అవకాశం ఉన్నందున నివారణకు 3 గ్రాముల కాపర్-ఆక్సీక్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ తడపాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కందికి పైటోఫ్తోరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 3 గ్రాముల కాపర్-ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల చుట్టూ తడపాలి, వర్షాలు ఆగిన తరువాత నేలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల మల్టీ-కే(130-45) మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట లేత దశలో తేమకు చాలా సున్నితం, అధిక నీటి నిలువను తట్టుకోలేదు. కావున పొలంలో మురుగు నీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. ఈ సమయంలో అధిక తేమ వల్ల భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఉదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రాముల 19+19+19+ లేదా 20 గ్రాముల డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న రకాలను జూలై 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
పంటలో ఆకుమచ్చ తెగులు కాండం కుళ్లు తెగులు గమనించినట్లయితే 2.5 కార్బెండిజమ్+మాంకోజెబ్ లేదా 2 మి.లీ. పిఫ్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఇప్పటి వరకు వరి నార్లు పోయని రైతులు వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వల్ల సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
రైతులు పంటల సస్యరక్షణ విషయంలో సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని డీఏవో గోపాల్ సూచించారు.