పరిగి : ప్రతి వార్డులో వందశాతం వ్యాక్సినేషన్ వేయించే బాధ్యత సంబంధిత వార్డు కౌన్సిలర్లదేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై వికారాబాద్లోని అంబేద్కర్భవన్లో శుక్రవారం మంత్రి సబితారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైద్యాధికారులతో సమిక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఒక ఇంటికి పదిసార్లయినా వెళ్లి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ బాధ్యతను ఆయా వార్డుల కౌన్సిలర్లు తీసుకోవాలని మంత్రి తెలిపారు. వైద్య సిబ్బంది, ఇతర అధికారులు స్థానిక వార్డు కౌన్సిలర్లకు బాధ్యతలు అప్పగించాలని, ఒక ఇంటికి నాలుగుసార్లు అవసరమైతే పదిసార్లు వెళ్లినా సరే వ్యాక్సిన్ వేయించేంత వరకు విశ్రమించరాదని పేర్కొన్నారు.
వ్యాక్సిన్పై అపోహలను తొలగించాలని, ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ పొందడానికి రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని సూచించాల్సిందిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 లక్షలు వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు గురుకులాలు సందర్శించాలని, అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలని మంత్రి సూచించారు. మొదటి డోసు తీసుకున్న వారు సకాలంలో రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారికి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. మొదటి డోసు వేయించుకున్న వారి ఫోన్ నంబర్లు వైద్య సిబ్బంది దగ్గర ఉంటాయని, వారికి సమాచారం అందించి వ్యాక్సిన్ వేయించాలన్నారు. వలస వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా తెలుసుకోవాలని, తీసుకోనియెడల వెంటనే తీసుకునేలా వారిని ఒప్పించలన్నారు.
ఈ నెలాఖరు వరకు ప్రతి గ్రామం, పట్టణంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి ఆదేశించారు. ముందుగా అధికారులు, ప్రజా ప్రతినిధులందరు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకొని ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో కోవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఇంటింటి సర్వే జరిపి వ్యాక్సిన్ వేయించుకోని వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి మరిన్ని కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని చెప్పారు. వారు నివాసముంటున్నచోట వ్యాక్సినేషన్ చేయించుకుంటే జిల్లా పరిధిలో వ్యాక్సినేషన్ లక్ష్యం చేరుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడలో పలు ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారా అని మంత్రి సబితారెడ్డి అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని ఓ వ్యక్తికి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాండూరు ఆర్డీవో అశోక్కుమార్, వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపల్ చైర్మన్లు మంజుల, ముకుంద అశోక్, స్వప్న, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.