వికారాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కూర మహతి స్వర్ణ పథకం సాధించింది. శుక్రవారం వికారాబాద్ అటవీ శాఖ అతిథి గృహంలో సైక్లింగ్ గ్రూప్ అసోసియేషన్ సభ్యులు మహతికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై మహతిని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటాలన్నారు. వికారాబాద్ ప్రాంతానికి చెందిన మహతి సైక్లింగ్ పోటీలో రాష్ట్రస్థాయిలో స్వర్ణ పథకం సాధించడం సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపి ప్రతిభ కనబర్చినప్పుడే ప్రాంతానికి పేరు ప్రతిష్టలు వస్తాయని వివరించారు. సైక్లింగ్ పోటీకి మహతిని ప్రోత్సహించిన తండ్రి కూర జయదేవ్గుప్తాను అభినందించారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.