ధారూరు : తెలంగాణ రాష్ట్రం దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, మండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు ఉచితంగా 24గంటల విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి, దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటమన్నారు.
ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ఆధార్, బ్యాంక్ వివరాలు సరైన పద్ధతిలో తీసుకోని నేరుగా రైతుల ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.