వికారాబాద్, మే 18 : తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్హెడ్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, అధికారిక కమ్యూనికేషన్లలో తెలంగాణ కోడ్ టీఎస్కు బదులుగా టీజీ వినియోగించాలని ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఇకపైన ‘టీఎస్’ స్థానంలో అధికారికంగా ‘టీజీ’ అని మార్చుకునేలా మే 30 తేదీ డేడ్ లైన్గా ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహించే ఉత్తర, ప్రత్యుత్తరాల్లో టీఎస్కు బదులుగా టీజీని ముద్రించాలన్నారు. అన్ని కార్యాలయాల్లో టీఎస్కు బదులు టీజీగా మార్చుతూ మే 26వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.