పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, ఇతర రాష్ట్రాల్లో వడ్లు కొనుగోలు చేస్తూ తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో వడ్లు పండిస్తారని, పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తుందని, తెలంగాణ రైతులను అధోగతిపాలు చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు. వానాకాలం వడ్లు కొనుగోలుకు సంబంధించి సైతం తిరకాసులు పెడుతుందని, ఇచ్చిన టార్గెట్ కంటే అధికంగా వడ్లు వచ్చాయని, వాటన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, పంటలకు పెట్టుబడి సహాయం అందిస్తూ, 24గంటలు ఉచితంగా వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు.
కేంద్రం వడ్లు కొనుగోలు చేయమని చెప్పినందున రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైస్మిల్లర్లతో ఎవరైనా ఒప్పందం చేసుకుంటే వారు వేసుకోవచ్చని అన్నారు. కంది, పత్తి సాగుపై దృష్టి పెట్టాలని, కందికి క్వింటాలుకు రూ.7000, పత్తికి క్వింటాలుకు రూ.8,500 ధర లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి రైతుబందు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడతాయని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, పరిగి, కులకచర్ల మండల రైతుబంధు సమితి అధ్యక్షులు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్వర్దన్రెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.