పరిగి : వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు సంబంధిత అధికారు లు కృషి చేయాలని చెప్పారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో జరిగిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 1.50లక్షల మంది కార్మికులు ఉన్నారని, వారందరి పేర్లు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాల్సిందిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 26న ఈ-శ్రమ్ ద్వారా ఉచిత నమోదు ప్రక్రియ చేపట్టిందని చెప్పారు.
ఆధార్కార్డు, బ్యాంకు పాసు పుస్తకంతో అన్ని మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వారందరికీ యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ గల ప్రత్యేక గుర్తింపుకార్డు జారీ చేయడం జరుగుతుందన్నారు. పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 2లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని, 16 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రిక్షా తొక్కే వారు, ఇళ్లలో పనిచేసే వారు, మత్స్యకార్మికులు, ఉపాధిహామీ కూలీలు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, తోపుడుబండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ర్టిషియన్లు, పారిశుధ్య కార్మికులు, బీడీ కార్మికులు అర్హులన్నారు.
ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఆదాయపు పన్ను చెల్లించే వారు అర్హులు కారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు మల్లేశం, కోఠాజీ, పుష్పలత, డీడబ్ల్యూవో లలితకుమారి, మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.