పరిగి : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ధి విద్యార్థులకు నాణ్యమైన విద్య, అవసరమైన వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. జిల్లాలోని 19 మండలాల్లో మొదటి విడతలో ఎంపికైన 371 పాఠశాలలు అధికారులు వెంటనే సందర్శించి స్థానిక ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు.
ఎంపికైన పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 12 అంశాలైన తాగునీరు, విద్యుద్దీకరణ, ఫర్నీచర్, మరుగుదొడ్లు, గ్రీన్చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీగోడల నిర్మాణం, కిఛెన్షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, లేదా మరమ్మతు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి అంచనాలు పారదర్శకంగా సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, ప్రహరీగోడల నిర్మాణపు పనులకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టాలన్నారు.
నిర్వహణ కమిటీల ద్వారా రెండు బ్యాంకు ఖాతాలను తెరువాలని, ఒకటి శాఖాపరమైన ప్రభుత్వ నిధుల కోసం, రెండవది దాతల నుంచి సేకరించిన నిధుల కోసమన్నారు. పాఠశాల అవసరాలకు సంబంధించి అంచనా, చెల్లింపులు ప్రతి అంశం జంక్ కమిటీల తీర్మాణం ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. చేపట్టిన పనులకు సోషల్ ఆడిట్ ఉంటుందని, రికార్డులు జాగ్రత్తగా నిర్వహించాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, ఇంజినీరింగ్ అధికారులు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.