కొడంగల్, జనవరి 24: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొడంగల్ను వేగవంతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కొడంగల్ ప్రగతికి సమష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రజా సంక్షేమన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
నియోకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారులు పర్యటించి ప్రజా సంక్షేమానికి అవసరమైన అంశాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇదివరకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను మరింత స్ట్రెంథనింగ్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్లు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకునేందుకు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ప్రధాన వీధుల్లో హైమాస్ట్ లైట్లు తదితర ప్రగతి పనులకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఎంపీపీ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నందున ఈ ప్రాంతంపై సీఎంకు పూర్తి అవగాహన ఉన్నట్లు తెలిపారు. కొడంగల్లోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పునరుద్ధరించడం, కోస్గి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి, విద్యుత్ తదితర ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొడంగల్ ప్రాంతం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఆగ్రో ఇండస్ట్రీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరతగతి అభివృద్ధికి గాను రైల్వేలైన్ ఏర్పాటు దిశగా చర్యలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సర్పంచ్ల పదవీకాలం ముగియనుందని, అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీవో పాండు, ఎంఈవో రాంరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.