ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి వ్రతాలను ఆచరించారు. ఆయా ప్రాంతాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది.
రంగారెడ్డి న్యూస్ నెట్వర్క్ : వరాలనిచ్చే వరలక్ష్మీ రావమ్మా.. మా పూజలందుకోవమ్మా అంటూ మహిళలు జిల్లాలో వరలక్ష్మీ వ్రతాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అభిషేకాలు, అర్చనల అనంతరం ముత్తయిదువులకు పసుపు కుంకుమలను వాయనంగా ఇచ్చారు. ఇండ్లల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించి పూజలు చేశారు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వరలక్ష్మీ వ్రతాలతో జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.