రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పదేండ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రజలకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి అయినా పొందేందుకు అప్డేట్ చేసుకున్న ఆధార్ ఉపయోగపడుతుందని వివరించారు.
పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సమీపంలో గల ఆధార్ కేంద్రాల్లో అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. myaadhar.uidai.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1947 నెంబర్కు కాల్ చేయవచ్చని, help@uidai.gov.inoh.help@uidai.net.inకు మెయిల్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జి.ఏ.రాజ్కుమార్, సహాయ మేనేజర్ సత్యకళ, ఈ-సేవ జిల్లా మేనేజర్ నాగభూషణం, టీఎస్టీఎస్ డీఎం సాయి కుమార్రెడ్డి, సీడీపీఓ స్వాతిశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.