రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఈ ఏడాది యాసంగి కలిసి రాలేదు. అనావృష్టి పరిస్థితుల్లో నానా కష్టాల నడుమ యాసంగి పంటలను పండించిన రైతన్నలను అకాల వర్షాలు మరింత ఆగం చేశాయి. కరువు పరిస్థితుల్లో అరకొర దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో కొద్దిపాటి ఆశలపైన వరుణ దేవుడు నీళ్లు చల్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 300 ఎకరాల్లో వరి, మొక్కజొన్నతోపాటు మామిడి వంటి పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. ఇక కాస్తో.. కూస్తో చేతికొచ్చిన వడ్లను సైతం అమ్ముకుందామంటే నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లతో ఆర్థికంగా చితికిపోతున్న జిల్లా రైతుల బతుకులు దైన్యంగా మారాయి.
-రంగారెడ్డి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ)
ఇటీవల కురిసిన అకాల వర్షం జిల్లా రైతాంగాన్ని ఆగమాగం చేసింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో గత యాసంగి కంటే ఈసారి తక్కువ ఎకరాల్లోనే వరి సాగు అయ్యింది. దిగుబడులు గణనీయంగా తగ్గనుండడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిగులు చెందుతున్న తరుణంలో అకాల వర్షం రైతులను మరింత కుంగదీసింది. జిల్లావ్యాప్తంగా 300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది.
అందులో 217 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇంకా నష్టం వివరాల లెక్కలు తీస్తున్నామని, త్వరలో ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెబుతున్నారు. ఆరుగాలం సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వర్షానికి నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా మిగలకపోవడం రైతు కుటుంబాలను కంటతడి పెట్టిస్తున్నది.
ఈ ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు జిల్లాలో కురవలేదు. మే నెల నాటికి 691.6 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. ఇప్పటివరకు 667.4మి.మీ.ల వర్షపాతమే కురిసింది. ఇంకా 3.5మి.మీ.ల లోటు వర్షపాతమే నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది యాసంగిలో గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. మండుతున్న ఎండలతో 15 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలతోపాటు వ్యవసాయ బోర్లలోనూ నీళ్లు పాతాళానికి అడుగంటాయి. ఈ క్రమంలో ప్రస్తుత యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గింది.
గతేడాది 1,23,240 ఎకరాల్లో రైతాంగం పంటలను సాగు చేయగా.. ప్రస్తుత యాసంగిలో గతంలో కంటే 20వేల ఎకరాల్లో తక్కువగా పంటల సాగు నమోదైంది. గత యాసంగిలో వరి సాగు 90,447 ఎకరాలు ఉంటే.. ప్రస్తుత యాసంగిలో 83,110 ఎకరాల్లో మాత్రమే సాగైంది. మొక్క జొన్న గత సీజన్లో 13,530 ఎకరాలు ఉంటే.. ఈసారి 6,150 ఎకరాలకే పరిమితమైంది. సీజన్ ఆరంభ నుంచే పంటల సాగుకు రైతన్నలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. కరెంటు, సాగునీటి కొరత కారణంగా యాసంగిలో రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. మొన్నటి వరకు పుట్ల కొద్దీ వడ్లు పండిన జిల్లాలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది.
పంటలతోపాటు కూరగాయల సాగు సైతం ప్రస్తుత సీజన్లో గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలు, పండ్లు, పూల దిగుబడులు తగ్గిపోయి మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వరితోపాటు వివిధ రకాల సాగు తగ్గడంతో వాటి ధరల పెంపుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్నాళ్లక్రితం వరకు రూ.4వేలు ఉన్న క్వింటాల్ బియ్యం ధర రూ.6వేలకు పైగానే పలుకుతున్నది. ఫలితంగా రానున్న రోజుల్లో ఆహార ధాన్యాన్ని కొనలేని పరిస్థితులు నెలకొననున్నాయి.
యాసంగిలో పంటలు చేతికందక రైతు కుటుంబాలు దైన్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సాంత్వన కరువైంది. ఎండిన పంటలకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తున్నది. అకాల వర్షాలు రైతులను మరింత కుంగుబాటుకు గురిచేయగా.. ఓదార్పు కల్పించే చర్యలేవీ ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టలేదు. దీనికితోడు పండిన కాస్త ధాన్యాన్ని సైతం అమ్ముదామనుకుంటే.. సకాలంలో కొనే పరిస్థితి లేదు.
జిల్లాలో ఆర్భాటంగా 33 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ.. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. ఇటీవలనే మంచాల మండలం గొడుకొండ్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 34 మంది రైతుల నుంచి కేవలం 134 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. నేడో, రేపో ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో కొనుగోళ్లను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు పంటలు చేతికందక.. మరోవైపు అరకొర పంటలకు సైతం మద్దతు ధర రాక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.