వికారాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వంపై ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా, ఎనిమిదేండ్ల పాలనలో అవినీతిరహిత ప్రభుత్వంగా పేరొందిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు లక్ష ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
పేపర్ లీకేజీ ఘటన దృష్ట్యా ఉద్యోగార్థులు ఆందోళన చెందొద్దంటూ భరోసానిస్తున్నది. అంతేకాకుండా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతోపాటు మిగతా పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు నిర్ణయించిన దృష్ట్యా మళ్లీ పరీక్షలను నిర్వహించే వరకు ఉద్యోగార్థులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను పరీక్షల ముందు వరకు కొనసాగించేందుకు నిర్ణయించింది. పరీక్షా ఫీజును మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
మరోవైపు ఆన్లైన్లో ఉచితంగా స్టడీ మెటీరియల్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న స్టడీ రూమ్స్ ఇకపై 24 గంటలపాటు స్టడీ రూమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. మరోవైపు ఉద్యోగార్ధుల నిమిత్తం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్ధులు..
పోస్టుల భర్తీ నేపథ్యంలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగం కొట్టాలనే కసితో నిరుద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రకటన వెలువడిన రోజు నుంచి జిల్లాలోని అన్ని గ్రంధాలయాల్లో నిరుద్యోగుల సందడి నెలకొన్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రంధాలయాలు నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గ్రంధాలయాల్లో అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది.
లక్ష ఉద్యోగాల భర్తీ..
లక్ష ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. గ్రూప్-1, 2, 3, 4 పోస్టులతోపాటు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నది. తాజాగా 80,039 వేల పోస్టులను భర్తీ చేసేందుకుగాను ప్రభుత్వం చేపట్టింది. వీటిలో జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు 2 వేల వరకు ఖాళీలున్నాయి. గతంలో స్థానికేతరులకు ప్రాధాన్యమిస్తూ స్థానికులకు గల పాలకులు అన్యాయం చేశారు. దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త జోనల్ విధానంతో ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టుల్లో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి. మిగతా 5 శాతంలో స్థానికులతోపాటు స్థానికేతరులు కూడా పోటీ పడవచ్చు. ఇకపై ప్రతీ ఏటా ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి క్యాలెండర్ను కూడా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జోనల్ విధానం ఏర్పాటు, కొత్త జోనల్ ప్రకారం జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియతో ఉద్యోగ ఖాళీల లెక్కతేల్చారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో ఉద్యోగార్ధుల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆన్లైన్లో ఉచిత స్టడీ మెటీరియల్..
గ్రూప్స్ చుదవుకునే అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచనున్నది. వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఉచిత శిక్షణ అందించడం సంతోషంగా ఉన్నది. అభ్యర్థులకు భోజన వసతి కల్పించడం మంచి ఆలోచన.
– ప్రవీణ్, జైదులపల్లి, వికారాబాద్
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆసక్తితో బాగా చదువుకుంటున్నా. అవసరమైన స్టడీ మెటీరియల్, భోజన సదుపాయం, 24 గంటల పాటు రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం బాగుంది. జూన్లో జరగబోయే గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నా.
– సుజాత, ధారూరు
ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషకరం..
టీఎస్పీఎస్సీ ద్వారా నియమించే గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నా. నవాబుపేట నుంచి వికారాబాద్కు ప్రతి రోజు శిక్షణ కోసం వస్తున్నా. ఆన్లైన్లో స్టడీ మెటీరియల్, రీడింగ్ రూమ్ వంటి సదుపాయాలు కల్పించడం ఆనందంగా ఉన్నది. సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సుధాకర్, నవాబుపేట