షాబాద్, మే 18 : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ)ద్వారా జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి చైర్మన్ తెలియజేశారు. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు.
పరీక్షకు ముందు బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. ఉదయం 10 గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేయాలని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లతో పాటు బయోమెట్రిక్ కాప్చర్ కోసం 160 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ప్రత్యేకంగా అదనపు ఇన్విజిలేటర్లను సైతం నియమించాలని సూచించారు. బయోమెట్రిక్ వేలిముద్రల సేకరణ ప్రక్రియ కోసం పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
సెల్ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎగ్జామ్ ప్యాడ్కు అనుమతి ఉండదని, అభ్యర్థులు వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని హితవు పలికారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ తీసుకొని రావాలన్నారు. దివ్యాంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులచే పరీక్ష రాసేందుకు అనుమతి కోరిన చోట, అలాంటివారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని, తమ వెంట వైకల్యం ధ్రువీకరించే సర్టిఫికెట్ తేవాలని చైర్మన్ స్పష్టం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులంతా ఉదయం 9గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్ డెస్క్ టేబుళ్లు, పరీక్షా గదుల్లో తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు.
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, సిట్టింగ్ స్కాడ్, ఫ్లయింగ్ స్కాడ్ తదితరులకు పరీక్షల నిర్వహణ తీరు, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వీలుగా శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని ఈమేరకు టీఎస్పీఎస్పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్నా పత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని పోలీసుల బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఇతరులెవరినీ అనుమతించకూడదని చైర్మన్ అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులతో మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 93 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 55,692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపరింటెండెంట్తోపాటు పరీక్షా కేంద్రంలో ఉండి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు గైడెన్స్ అన్నింటినీ పునశ్చరణ చేసుకోవాలన్నారు.
అభ్యర్థులకు తెలిసేలా పరీక్షా కేంద్రం పేరు, పేపర్ కోడ్, ఏరియా ఆయా పరీక్షా కేంద్రాల ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఇన్విజిలేటర్లు జాప్యం చేయకుండా కరెక్ట్ టైంకు పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయనట్లయితే ముందుగా తెలియజేయాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు.
పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు 9 గంటలలోగా చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ వారికి, పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేయించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషర్లు, డీపీఓలకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏఎన్ఎమ్ను అందుబాటులో ఉంచాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు నో రిలేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ముందు రోజు కూడా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు.
వికారాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 5,468 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా 13 పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు. వికారాబాద్లో 7, తాండూరులో 4, పరిగిలో 2 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని వసతులతో సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రిలిమినరీ పరీక్ష పూర్తి బందోబస్తు మధ్య, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుల్, హోంగార్డులు విధులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్ కృష్ణ ఉన్నారు.