రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణించాడు.
దశరథకు టీఆర్ఎస్ ప్రమాద బీమా సభ్యత్వం ఉండటంతో బీమా పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే యాదయ్య మృతుడి బ్యాగారి వసంతకు ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.