ఇస్లామాబాద్:భారత్లో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన విధ్వంసం తెలిసిందే. అయితే పాకిస్థాన్లో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో యువత ఉద్యమిస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ హోంశాఖ మంత్రి మోషిన్ నఖ్వీ(Moshin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. యువత తలుచుకుంటే దేన్నైనా మార్చగలరని అన్నారు. వాళ్లు(కాక్రోచ్లు) ఐక్యం అయితే ఏదైనా సాధ్యమే అన్న రీతిలో ఆయన స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థలో సూక్ష్మ స్థాయిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్లామాబాద్లో జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత వ్యవస్థ కుప్పకూలిందని, పెరుగుతున్న దేశ సవాళ్లను ఈ వ్యవస్థ ఎదుర్కొనే సామర్థ్యంలో లేదన్నారు. మనం నివసిస్తున్న వ్యవస్థ కుప్పకూలిందని, దీంతో సమస్యలను తీర్చలేమని ఆయన అన్నారు. సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాంటి సమస్యలతోనే పాకిస్థాన్ బాధపడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. నిరుద్యోగం, రాజకీయ వైరుధ్యాలు, భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. బలోచిస్తాన్, ఖైబర్ ఫుక్తున్క్వాలో భద్రత పెను సమస్యగా మారింది.
అయితే ఇటీవల సీజేపీ నేతృత్వంలో భారత్లో సాగిన ఉద్యమాన్ని పాకిస్థాన్ స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. సంస్కరణల గురించి మాట్లాడిన మంత్రి నఖ్వీ.. నిర్వీర్య దశలోనే ఉన్న దేశ యువతను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువతను ఏమైనా పిలవండి, యువకుడా లేకా కాక్రోచా లేక ఇంకేదైనా అనండి, ఒకవేళ ఈ కాక్రోచ్లు ఏకం అయితే, వాళ్లు దేన్నైనా మార్చగలరని అన్నారు. పాకిస్థాన్ సమస్యలన్నీ మిలిటరీ నాయకత్వంతో పరిష్కరించలేమని, ఎయిర్ చీఫ్ మార్షల్ అసిమ్ మునీర్ ఎన్ని చేసినా.. విస్తృత స్థాయిలో వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని మంత్రి నఖ్వీ తెలిపారు.