రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతుల బతుకులు దినదిన గండంగా మారనున్నాయి.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్ల వంటి విధానాలతో రైతుల జీవితాలు ఆగం కానున్నాయి.. అత్తెసరు కరెంటు, 10 హెచ్పీ మోటర్ల కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు , స్టార్టర్లు కాలిపోయి ఆర్థికంగా నష్టపోతామని జిల్లా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంటలకు సరిపడా నీరందక ఎండిపోయే ప్రమాదముందని, ఫలితంగా సాగు భూములన్నీ మళ్లీ బీడు భూములుగా మారే దుస్థితి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కొంప ముంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు పూటకో ప్రకటన చేస్తున్నారన్నారు. ఆ పార్టీని నమ్మితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని, ఏదేమైనా మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ పూటకోమాట మాట్లాడుతూ రైతుల బతుకులను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. మొన్నటివరకు 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెసోళ్లు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీపై రంగారెడ్డి జిల్లా రైతాంగం అగ్గిమీద గుగ్గిలమవుతున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు రైతు బంధుతో సాగుకు పెట్టుబడి సాయం, కావల్సినన్ని నీళ్లు అంది ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తరుణంలో మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న కుయుక్తులను చూసి రైతు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. 3 గంటల కరెంటుతో పొలంలో ఒక మూలకు సైతం నీరు పారదని, 10 హెచ్పీ మోటర్లతో నీళ్లన్ని తోడేస్తే ఆతర్వాత బోర్ల పరిస్థితి, పంటల పరిస్థితి ఏంటని? రైతులు ప్రశ్నిస్తున్నారు. అత్తెసరు కరెంటు, 10 హెచ్పీ మోటర్ల కారణంగా తరచుగా ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే తమ బతుకులు అంధకారమయం కావడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొని తెచ్చుకున్నేట్లనని రైతాంగం పేర్కొంటున్నది.
10 హెచ్పీ మోటర్లు అవసరమే లేదు
వ్యవసాయం చేయని రేవంత్రెడ్డికి 10 హెచ్పీ, 3 హెచ్పీ మోటర్ల గురించి ఏం తెలుస్తుంది. 10 హెచ్పీ మోటర్లు పెడితే ట్రాన్స్ ఫార్మర్లు పెట్టాల్సి వస్తుంది. అవి ఉంటాయో కాలిపోతయో తెలువదు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటే 200 నుంచి 300 అడుగుల లోతులో బోరు వేయాలి. 10 ఫీట్ల కేసింగ్ పైపులు వేయాలి. ఈ లెక్కన ఒక బోరు వేస్తే దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. 10 హెచ్పీ మోటర్ కొనాలంటే రూ. 40 వేలకు పైగా అవుతుంది. అది కాలిపోతే రిపేరు చేయాలంటే రూ.10 వేలకు పైగానే అవుతుంది. 10 హెచ్పీ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ కూడా పెంచాలి. ఇంత ఖర్చు సాధారణ రైతు భరించడం చాలా కష్టమైన పని. 3 గంటలు మోటరు నడిస్తే ఒక ఎకరం మాత్రమే పారుతుంది. 10 హెచ్పీ మోటర్ పెట్టి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తే రైతులందరూ ఒకేసారి మోటర్లు అన్చేస్తే లోడింగ్ ఎక్కువ పడి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ప్రమాదముంటుంది కావున రైతులకు 10 హెచ్పీ మోటర్లు అవసరమే లేదు.
– లండం శేఖర్, మోటర్ వైండింగ్ మెకానిక్, ఆమనగల్లు మున్సిపాలిటీ 14వ వార్డు
మూడు గంటల కరెంట్ సరిపోదు
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్తో సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తామంటున్న మూడు గంటల కరెంట్తో పొలానికి నీరు పారదు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్తో పంటలకు నీరందక ఎండిపోతాయి. కాంగ్రెస్ను నమ్మితే వ్యవసాయం పూర్తిగా ఆగమైతది. రైతులు 10 హెచ్పీ వాడమని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? 10 హెచ్పీ మోటర్ వాడే ఆర్థిక స్థోమత రైతులకు ఉండదు, ఆ మోటర్తో బోర్లు ఎండిపోతాయి. 10 హెచ్పీతో లాభం కన్నా రిపేర్లే ఎక్కువ. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ను రైతులు నమ్మే రోజులు పోయాయి. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– నేనావత్ పాండునాయక్, కడ్తాల్
మూడు గంటల కరెంట్ రైతులకు సరిపోదు
రైతులకు మూడు గంటల కరెంట్ అస్సలు సరిపోదు. మూడు గంటల కరెంట్తో రైతులకు రెండు మడులు పొలం పారదు. ప్రస్తుతం ఉన్న కరెంట్తోని రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులకు 10 హెచ్పీ మోటర్లతో ఎలాంటి ప్రయోజనంలేదు. 500 ఫీట్లకు పైగా క్రిందికి వాటర్ ఉన్నప్పుడు 10 హెచ్పీ మోటర్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వంద నుంచి రెండు వందల ఫీట్లలోపే వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న కరెంట్తోని రైతులకు ఉన్న పొలం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– రమేశ్, బోరు మెకానిక్(రైతు), తలకొండపల్లి
10 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేయడం చాలా కష్టం
10 హెచ్పీ మోటర్లు పెట్టి వ్యవసాయం చేయడం చాలా కష్టం. 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే రూ.లక్ష కావాలి. అది సన్న, చిన్నకారు రైతులకు భారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారు. 3 గంటల కరెంట్ పగలు ఇస్తారా..? రాత్రి ఇస్తారా చెప్పడం లేదు. రైతులు 3, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టడంతో ట్రాన్స్ఫార్మర్ల మీద ఒకేసారి లోడ్ పడుతుంది. అప్పుడు లో ఓల్టేజీ ఏర్పడి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మళ్లీ పాత రోజులే వస్తాయి. వ్యవసాయంలో నష్టం వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రైతులు నష్టపోతారు.
– మేకల సుధాకర్, సురంగల్, మొయినాబాద్
3 గంటల కరెంట్ సరిపోతుందనడం అవివేకం
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇస్తామని అంటే మళ్లీ పాత రోజులు వచ్చినట్లే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటలు పండించుకుని సంతోషంగా జీవిస్తున్నాం.
– రఘుపతిరెడ్డి, రైతు, చేవెళ్ల టౌన్
కాంగ్రెసోళ్లకు ఏమి తెలుసు
వ్యవసాయం గురించి కాంగ్రెసోళ్లకు ఏమి తెలుసని 3 గంటల కరెంట్ ఇస్తామంటున్నారు. ఎకరాకు నీళ్లు పట్టేందుకు ఎన్ని గంటల విద్యుత్ సరిపోతుందో తెలుసా అసలు. పొలం వద్ద 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే నడుస్తున్నాయి. 10 హెచ్పీ మోటర్తో ఉన్న నీటిని వాడేస్తే బోర్లు ఎండిపోవడంతోపాటు రైతులకు ఖర్చు ఎక్కువ అయితది. 10 హెచ్పీ మోటర్లు ఒకేసారి ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదముంది. కాంగ్రెస్ హయాంలో రైతులు కంటి నిండ నిద్ర కూడా పోలేదు. ఎప్పుడు చూసినా పొలం వద్దనే ఉండేవాళ్లం. రైతుల తలరాతను మార్చేలా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
– వెంకటేశ్, రైతు, షాద్నగర్టౌన్
కాంగ్రెస్కు తగిన బుద్ధి చెపుతాం
మా పొలంలో 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లను వాడి పంటలు పండిస్తున్నాం. రేవంత్రెడ్డి చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్ వాడితే చాలా సమస్యలు వస్తాయి. కరెంట్ లోడ్ ఎక్కువ అయితది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పొలాలు ఎండిపోతయి. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ అవలంబిస్తున్నది. రైతులందరూ వారికి తగిన బుద్ధి చెపుతారు. కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కేస్తారు. రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలి.
– ఎదిరె రాములు, రైతు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల రూరల్
మూడు గంటలిస్తే ఒక్క మడి కూడా తడువదు
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఒక్క మడి కూడా సరిగా తడవదు. గతంలో కరెంట్ కోసం అనేక కష్టాలు పడ్డాం. బోర్లలో నీరు లేకపోవడంతో, అప్పటి ప్రభుత్వాలు కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. తెలంగాణ వచ్చినంక రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నారు. పంటలకు అవసరమున్న సమయంలో బోరు ఆన్ చేసుకుని నీరు పెడుతున్నాం. రాత్రిపూట కరెంట్ కోసం బోరు మోటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పనిలేకుండా పోయింది. సీఎం కేసీఆర్తోనే రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
– పి.పోచయ్య, రైతు, కుమ్మరిగూడ, షాబాద్