టీచర్ల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,876 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. బదిలీలు, ఉద్యోగోన్నతి ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు విద్యా శాఖ పక్కాగా చర్యలు తీసుకుంటున్నది. అక్టోబర్ 3 లోగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో 2వేల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగనున్నది. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా 65 మందికి, స్కూల్ అసిస్టెంట్లుగా 112 మందికి ప్రమోషన్లు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊపడం సంతోషం. ఎనిమిదేండ్ల తర్వాత బదిలీలు జరుగుతున్నందున ఆనందంగా ఉన్నది. బదిలీల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే బాగుంటుంది. ఉపాధ్యాయుల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉన్నది.
– వర్కాల పరమేశ్, పీఆర్టీయూ అధ్యక్షుడు,
రంగారెడ్డి, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 3 లోపుగా ఉద్యోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ పూర్తి చేయనున్నది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ షురూ.. కావడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,876 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా 2వేల మందికి ప్రయోజనం కలుగనుంది. అలాగే.. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా 65 మందికి, స్కూల్ అసిస్టెంట్లుగా 112 మందికి ప్రమోషన్లు కలగనున్నాయి.
టీచర్ల బదిలీలు చివరిసారిగా 2018 జూలైలో జరిగాయి. ఆ తర్వాత 2023 జనవరిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం బదిలీలను చేపట్టలేకపోయింది. తాజాగా.. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం గతంలో ఆగిపోయిన ప్రక్రియను వేగవంతం చేసింది. సెప్టెంబర్ నెలను కటాఫ్గా తీసుకోవడంతో 8 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. అలాగే ఐదేండ్లు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు బదిలీల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలిగింది. జిల్లాలో చాలామంది దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత బదిలీల ప్రక్రియతో దంపతులైన ఉపాధ్యాయులు ఒకే చోట పనిచేసే అవకాశం కలుగుతుండడం ఊరటను కలిగిస్తున్నది.
టీచర్ల బదిలీలను ప్రభుత్వం పారదర్శంగా చేపడుతున్నది. సుదీర్ఘకాలం తర్వాత చేపడుతున్నటువంటి ఉపాధ్యాయ బదిలీలో ఎటువంటి అవినీతికి ఆస్కారం కల్పించకుండా సెక్రటేరియట్ బదిలీలు చేపట్టకుండా, మెడికల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నటువంటి వారి ధ్రువపత్రాలు, క్షుణంగా పరిశీలించి న్యాయపరంగా పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
– అగ్బర్, ఉపాధ్యాయుడు , చేవెళ్ల
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు ఉపాధ్యాయ సమాజానికి చాలా ఉపయుక్తం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– వాడ్యాల వెంకట్రాంరెడ్డి, పీఆర్టీయూ మాడ్గుల మండల అధ్యక్షుడు
‘రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కాంక్షించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో బదిలీల సందర్భంగా ఉపాధ్యాయులు రాజకీయ నాయకులను ఆశ్రయించే సంప్రదాయం ఉంటుండెడిది. తెలంగాణ ప్రభుత్వం పైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా పారదర్శకంగా చేపడుతున్నది. ప్రత్యేక శద్ద చూపించి కోర్టులో బదిలీలు, పదోన్నతులపై ఉన్న స్టేను వెకేట్ చేయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 1 కటాఫ్ డేట్ పెట్టి చాలా మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం మేలు కలిగేలా చేసిందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య ‘నమస్తే’తో పలు విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..’
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురు చూస్తుండడంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో షెడ్యూల్ను జారీ చేసింది. కానీ..కొంతమంది ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరుగుతున్నదని కోర్టును ఆశ్రయించడం వల్ల బ్రేక్ పడింది. ఉపాధ్యాయులకు ఎలాగైనా న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం కోర్టులో స్టేను వెకేట్ చేయించడానికి తీవ్రంగా శ్రమించింది. స్టే వెకేట్ అయినవెంటనే ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే షెడ్యూల్ను జారీ చేసి బదిలీల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతుండడం శుభ పరిణామం.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా మూడువేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఫిబ్రవరి కటాఫ్ డేట్తో జారీ చేసిన షెడ్యూల్తో 30-35వేల మందికి ప్రయోజనం కలిగేది. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సెప్టెంబర్ 1తేదీని కటాఫ్గా నిర్ణయించింది. ప్రస్తుత షెడ్యూల్తో యాభైవేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్గుతుంది.
గతంలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సవరణలు చేసుకునేందుకు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. అలాగే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.