రంగారెడ్డి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. వారు చేపట్టాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలియజేస్తూ రూపొందించిన హ్యాండ్బుక్ను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల పరిధిలోని పరిస్థితులను ముందుగానే గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హకు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎవరైనా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఎన్ కోర్ యాప్లో ఎంట్రీ చేయాలన్నారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, వివిధ అంశాల ప్రాతిపదికన సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదికను సహాయ రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఇందులో జిల్లా ఉప ఎన్నికల అధికారిణి ప్రతిమాసింగ్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారిణి సం గీత, ఎంసీసీ నోడల్ అధికారిణి సౌమ్య, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి సురేశ్మోహన్, ఏఆర్ఈవోలు, సెక్టోరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
లోక్సభ ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం ఆయన స్టాటిక్ సర్వేలైన్స్, ఫ్లయింగ్స్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులకు కలెక్టరేట్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందం ఎనిమిది గంట లపాటు విధులు నిర్వర్తించేలా డ్యూటీలు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని పార్టీలు, అభ్యర్థుల పట్ల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టాటిక్ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్వాడ్ తదితర బృందాలకు సమకూర్చిన వాహనాలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీటీజీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. నిఘా బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల మధ్య డబ్బుల లావాదేవీలు జరిగితే కచ్చితంగా రసీదుండాలని, రూ.10లక్షలపైన లావాదేవీలుంటే ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వెళ్తుందన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ టీంలు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 3,455 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 25వరకు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. 26న స్క్రూట్నీ ప్రక్రియ, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయని.. చేవెళ్ల ఎంపీ పార్లమెంట్ పరిధిలో నామినేషన్ల కోసం రాజేంద్రనగర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఆన్లైన్లోనూ నామినేషన్లను సమర్పించొచ్చని.. ఆన్లైన్లో చేశాక ఫిజికల్ కాపీని అందించాల్సి ఉంటుందని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు
జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నోడల్ అధికారులను నియమించామని, ప్రతి నియోజకవర్గానికీ 9 చొప్పున ఫ్లయింగ్, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిషరించేందుకు జిల్లాలో ఎంసీసీ, వీడియో సర్వేలైన్స్ బృందాలు, ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘనపై ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీనంబర్కు ఫిర్యాదు చేయొచ్చని.. దీంతోపాటు సీ-విజిల్ యాప్నూ ఈసీ అందుబాటులో ఉంచిందన్నారు.
ఎన్నికల నిర్వహణకు 16వేల సిబ్బంది
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు 16 వేల సిబ్బంది అవసరమని కలెక్టర్ శశాంక తెలిపారు. 3,455 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు రూ.95లక్షల వరకు ఖర్చు పెట్టుకునేందుకు ఈసీ అవకాశం ఇచ్చిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉండేదని, ఈసారి ఎన్నికల్లో ఈసీ 85 ఏండ్లకు పైబడిన వారికే ఈ అవకాశం కల్పిస్తున్నదన్నారు. వృద్ధులతోపాటు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు ఉన్నదని, బీఎల్వోల ద్వారా సంబంధిత 12-డీ ఫారాలను అందజేయడం జరుగుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25 తేదీ వరకు కూడా కొత్త ఓటు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులున్నారు.