రంగారెడ్డి, మార్చి 7(నమస్తే తెలంగాణ): ప్రతి పనిలోనూ మేము సైతమంటూ మహిళామణులు రాణిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలతోపాటు ప్రజాసేవ, సంఘసేవల్లోనూ ముందుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా ప్రాతినిథ్యం వహిస్తూ ప్రతిభను చూపుతున్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో ప్రతి రంగంలోనూ దూసుకెళ్తున్నారు. మహిళల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బాలికల చదువు నుంచి పెండ్లి వరకు రాష్ట్ర సర్కారు ఆదుకుంటున్నది. రేషన్, వ్యవసాయ భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు తదితర వాటికి ‘ఆమె’ను యజమానిని చేసింది. దవాఖానల్లో సకల సౌకర్యాలు, ఆర్థిక వృద్ధికి రుణాలనూ అందిస్తున్నది.
ఆడవారు గౌరవం పొందిన చోట దేవతలు సంచరిస్తారని పెద్దలు చెబుతుంటారు. వేద కాలం నుంచి మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం, అన్ని విషయాల్లోనూ ఆమె మాటే వేద వాక్కు. అయితే మూఢనమ్మకాలు, చాదస్తాలు మహిళల స్థానాన్ని కిందకు దించాయి. ఆడవారు చదువుకోవద్దని నిర్బంధాలు విధించారు. వంటింటి కుందేళ్లు అని వారి చుట్టూ గిరి గీశారు. అనేక సాంఘిక దురాచారాలకు బలి అయ్యారు. ఆడవారు చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. మగవారి చదువు అతనొక్కడికే పరిమితం. కానీ, ఆడవారి చదువు ఇంటింటికీ వెలుగు అవుతుందని గమనించిన లోకం వారిని నిబంధనల నుంచి విముక్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆడవారు చదువుతూ అన్ని రంగాల్లో నెమ్మదిగా రాణించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలి నుంచి దేశ అధ్యక్ష పదవి, యూఎస్, యూకే అధ్యక్షురాళ్లుగా.. యూఎన్వో ప్రధాన కార్యదర్శి వరకు మహిళలు రాణిస్తున్నారు. అంతరిక్షానికి సైతం వెళ్తున్నారు.
ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ.. ప్రోత్సాహం..
నేడు ప్రతి మహిళా పురుషులకు తీసిపోమని నిరూపిస్తున్నది. ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతూ అనుకున్నది సాధిస్తున్నది. నేడు ప్రభుత్వాలు సైతం వారు ఎంచుకున్న రంగాలకు చేయూతను ఇస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ, ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల అభ్యున్నతికి పలు రకాల రుణాలను అందిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూతను ఇస్తున్నది. స్త్రీ నిధి, సబ్సిడీ రుణాలు, జిల్లా పరిశ్రమల అభివృద్ధి శాఖ నుంచి పీఎంఈజీపీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. అయితే, అలా జూట్, కుటీర పరిశ్రమలను నెలకొల్పి పదుల సంఖ్యలో పొరుగు వారికి ఉపాధి కల్పిస్తున్న మహిళామణుల కథనాలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ..
ఒక్కరి సంపాదన సరిపోదని..
నా భర్త ప్రైవేట్ ఉద్యోగి. నగర పరిసరాల్లో బతకాలంటే ఒక్కరి సంపాదన సరిపోదు. నేను ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ఎంవోటీ ఆధ్వర్యంలో మొదట జూట్ బ్యాగులు, వస్తువుల తయారీపై, ఇంకా ఎలీప్ సంస్థ ఆధ్వర్యంలో 45 రోజులపాటు 2015లో శిక్షణ తీసుకున్నా. అనంతరం ఎలీప్ సంస్థలోనే ఎనిమిదేండ్లపా టు శిక్షకురాలిగా పని చేశా. కాగా రూ. ఐదు లక్షలతో జేకే ఇండస్ట్రీస్ అన్న సంస్థను ఏర్పాటు చేశా. దాదాపుగా 25 మందికి ఉపాధి కల్పించా. కరోనా పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం 15 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సంస్థను నిర్వహిస్తూనే జన శిక్షణ సంస్థలో ట్రైనర్గా పని చేశా. అక్కడ ఐదు నెలల పాటు శిక్షణ ఇచ్చా. జూ ట్ బ్యాగుల తయారీ, కటింగ్, స్టిచింగ్ మొదలైన అంశాల్లో కోవె ఆధ్వర్యంలో 50 మందికి, స్థానికంగా మరో 50 మం దికి కొత్తపేటలో శిక్షణ ఇచ్చా. ప్రస్తుతం మా జూట్ సంస్థ ఆశాజనకంగా కొనసాగుతున్నది.
ధైర్యంతో ఏదైనా సాధ్యమే..
నా భర్త కరోనా సమయంలో దూరమయ్యాడు. ఆయన ఉన్నప్పుడే నా కాళ్లపై నేను నిలబడాలని అనుకున్నా. నేను చదువుకున్నది డిగ్రీ. నేను చేయాలనుకున్న దానికి ఆయన మద్దతుగా నిలిచారు. అనంతరం, ధైర్యంతో రూ.5 లక్షలు పోగేసి చైతన్యపురి లో జేకే ఇండస్ట్రీస్ సంస్థను నెలకొల్పా. నా ఇద్దరు కొడుకులకు.. వారి చదువుకు నేనే ఇప్పుడు అండ. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా. ఒంటరి మహిళను అయినప్పటికీ ఏనాడు అదరలేదు.. బెదరలేదు. ఏలూరు నుంచి ముడి సరుకును తెప్పించుకుంటూ నాతోటి వారికి ఉపాధినిస్తూ సంస్థను విజయవంతంగా నడుపుతున్నా. ధైర్యంతో ఏదైనా సాధ్యమే. – గీత గూడ, జేకే జూట్ ఇండస్ట్రీస్
మమత జూట్ బ్యాగ్స్
నేను ఇంటర్ చదివా. నా భర్త బియ్యం వ్యాపారం చేస్తారు. మాకు ఉపాధి అంతంత మాత్రమే. వంటింటికే పరిమితం కాకుండా కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో నా భర్త ప్రోత్సాహంతో ఎలీప్ సం స్థ ద్వారా జూట్ బ్యాగుల తయారీలో శిక్షణను 45 రోజుల వరకు తీసుకున్నా. జూట్ స్టిచింగ్, కటింగ్, మేజర్మెంట్స్, ముడిసరుకు తెచ్చుకునే విధానంపై కసరత్తు చేశా. రూ.పది లక్షలతో సరూర్నగర్ – దిల్సుఖ్నగర్ పరిధిలో ‘మమత జూట్ బ్యాగ్స్ ఎంటర్ప్రైజెస్’ను ఏర్పాటు చేశా. మొదట 100 రకాల జూట్ బ్యాగులను తయారు చేశాం. మా వద్ద పెన్సిల్ పౌచ్, లంచ్ బ్యాగ్స్, ల్యాప్ట్యాప్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫైల్స్ బ్యాగ్స్, లగేజీ బ్యాగ్స్, మొదలైనవి ఎన్నో లభిస్తాయి. బ్యాగుల ధరలు రూ. వంద నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రారంభంలో 25 మందికి పైగా మా సంస్థలో ఉపాధి పొందేవారు. కరోనా రావడంతో ఆర్డర్స్ తగ్గి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం మా సంస్థలో 15 మంది పని చేస్తున్నారు. స్కూల్స్, కళాశాలలు, పెద్ద, పెద్ద కంపెనీల వాళ్లు ఆర్డర్లు ఇస్తుంటారు. ప్రతిరోజూ దాదాపుగా వంద నుంచి రెండొందల వరకు బ్యాగులను తయారుచేస్తా. జూట్ ముడి సరుకు బండిల్ వంద మీటర్లు ఉంటుంది. ఒక్కో మీటర్కు గతంలో రూ.65 ఉండేది. ప్రస్తుతం రూ. 135 నుంచి రూ.180 వరకు ధరలున్నాయి.
ధైర్యంగా ముందడుగేయండి..
మహిళలు దేనికీ భయపడొద్దు. ఎవరో రావాలి..సాయం చేయాలి అన్న విధానానికి ఫుల్స్టాప్ పెట్టండి. మీరు చేయాలనుకున్న పనిని ఓ ప్రణాళికాబద్ధంగా చేపట్టండి. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభు త్వం మహిళలు, వారి ఎదుగుదలకు ఎంతో చేయూతను ఇస్తున్నది. చేయాల్సిన పనిపై ధ్యాస ఉంచి ముం దుకెళ్తే అంతా మంచే జరుగుతున్నది. నేను నా ఇంటికి కొద్దో గొప్పో సాయపడుతున్నా.. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నా..
– పద్మాల మమత, జూట్ బ్యాగ్స్ నిర్వాహకురాలు