బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోసింది. సబ్బండ వర్ణాల ఉపాధి కోసం ఆర్థికంగా చేయూతనందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గొల్లకురుమల బతుకులు మారాలి.. వలసలు ఆగాలె.. వలస వెళ్లినవారు వాపస్ రావాలె అన్న సదుద్దేశంతో ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్కు ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించడంతో ఏటేటా రెట్టింపై సిరులు కురుస్తుండడంతో గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. జీవాలు అనారోగ్యానికి గురైతే సత్వరం వైద్యం అందించేందుకు సంచార వాహనాలను సమకూర్చింది.
ఒకప్పుడు బతుకుదెరువు లేక వలస వెళ్లినవారు సైతం ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సొంతూళ్లకు తిరిగొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో భాగంగా 11,685 మందికి 2,45,385 గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.300 కోట్ల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెలు రెట్టింపు కావడంతో గొల్లకురుమల ఆదాయం పెరిగింది. ఒకప్పుడు అప్పులు తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగామని పేర్కొంటున్నారు. ఒకప్పుడు బతుకుదెరువుకోసం వేరే రాష్ర్టాలకు వలస వెళ్లే వారమని, ప్రస్తుతం సర్కారు చేయూతతో ఆత్మగౌరవంతో బతుకుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ‘కులవృత్తులకు జీవం పోయాలె.. గొల్ల కురుమల జీవితాలు మారాలె.. బతుకుదెరువుకు వలసెళ్లినోళ్లు వాపస్ రావాలె.. ఉన్న ఊల్లెనే పని జేయాలె..ఆర్థికంగా ఎదగాలె.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రంగారెడ్డి జిల్లాలో సూపర్ సక్సెస్ అయ్యింది. మొదటి విడుతలో రూ.1.32 కోట్లను వెచ్చించి 11,685 యూనిట్లను ప్రభుత్వం గొల్ల కురుమలకు పంపిణీ చేసింది. రూ.300 కోట్లను వెచ్చించి ఈ ఏడాది జూన్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకం గొల్ల కురుమల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపడంతోపాటు గౌరవంగా తలెత్తుకునేలా చేశాయి. కూలీకెళ్తూ.. పాలేర్లుగా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చిన ఎందరో నేడు యజమానులుగా మారి సుఖసంతోషాలతో జీవిస్తున్నారు.
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలను అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 2017 జూన్లో మొదటి విడతలో 11,685 మంది గొల్ల కురుమలకు 2,45,385 గొర్రెలను పంపిణీ చేసింది. తొలి విడుతలో సబ్సిడీపై రూ.1.25 లక్షల విలువైన 21 గొర్రెలను రూ.31,750కే అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు పెంచి లబ్ధిదారుడి వాటాగా రూ.43,450కే అందిస్తున్నది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది జూన్ 9న జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. 30,009 యూనిట్ల కింద 6,30,189 గొర్రెలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకు రూ.300 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో రూ.కోటి విలువైన 746 యూనిట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. రాష్ర్టానికి ఎన్సీడీపీ రుణం ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డడంతో తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిధులు సమకూర్చుకుని రెండో విడుత పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. జీవాలు అనారోగ్యానికి గురైతే సత్వరం వైద్యం అందించేందుకు సంచార వాహనాలను సమకూర్చింది. 108 తరహాలో టోల్ఫ్రీ నంబర్ 1962ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సక్సెస్ కాగా.. ఏ గ్రామంలో చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. ఈ పథకం ప్రారంభించక ముందు జిల్లాలో 5.35 లక్షలు ఉన్న గొర్రెల సంఖ్య 2023లో 7,67,125కు పెరిగింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా నాణ్యమైన మాంసం లభిస్తున్నది. గొర్రెల సంపద మూడింతలు పెరిగిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లభించక.. తెలంగాణ గొల్ల కురుమలు ఇతర రాష్ర్టాలకు వలసపోయేవారు. కులవృత్తిని నమ్ముకుని గొర్రెలను పెంచుదామనుకుంటే జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి మేత దొరకని పరిస్థితి. దీంతో పొట్ట చేతబట్టుకుని ఆయా కుటుంబాలు వలసపోయేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గొల్ల కురుమలకు ఉపాధి కల్పించేలా సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేశారు. దీంతో వలస వెళ్లిన గొల్ల కురుమలు సొంతూళ్లకు తిరిగొచ్చారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు గొర్రెల క్రయ విక్రయాలను బేరగాళ్లే చేసేవారు. ప్రస్తుతం ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా గొల్ల కురుమలే బేరగాళ్లుగా మారి క్రయివిక్రయాల ద్వారా ఉపాధి సైతం పొందుతున్నారు.
గొల్ల కురుమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్కార్ సబ్సిడీపై గొర్రెలు అందించడం సంతోషకరం. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలూ గొల్ల కురుమలను పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని కులాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ సార్.. గొల్ల కురుమలకు సబ్సిడీపై 21 గొర్రెలు అందించి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేసే ముఖ్యమంత్రి మళ్లీ గెలిస్తే మరిన్ని మంచి పనులు చేస్తారు.
– గొల్ల పర్వతాలు, కుమ్మరిగూడ (షాబాద్)
యాదవ, కురుమ వర్గాలకు చెందినవారు ఆత్మ గౌరవంతో తలెత్తుకు జీవించాలనే గొప్ప ఉద్దేశంతో మా కోసం సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం పక్కాగా అమలవుతున్నది. రాష్ట్రంలో పేద మధ్య తరగతి న్రజల కోసం పైసా ఖర్చు లేకుండా 2017 నుండి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ పథకంతో మెరుగైన ఫలితాలను మేము పొందుతున్నాం. ఒక గొర్రెల యూనిట్ విలువ రూ.1.25 లక్షలు. ఇందులో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– కుర్వ రామప్ప, బెన్నూర్, యాలాల
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు ప్రాధాన్యతనిచ్చింది. మా గొల్ల కురుమలకు గొర్రెలను అందించడంతో ఆర్థికంగా ఎదిగాం. గతంలో ఉన్న ప్రభుత్వాలేవీ మాకు గొర్రెలను ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతో మా కుటుంబమంతా లబ్ధి పొందాం. కుల వృత్తులకు అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో అండగా ఉంటాం.
– యాదమ్మ, రాంపూర్, తలకొండపల్లి
గొల్ల కురుమ వర్గాల వారు తమ సంప్రదాయ వృత్తుల్లో సాధికారత సాధించడం కోసం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ పథకం సంజీవనిలా పనిచేస్తుంది. గొర్రెలను మాకు అందించడంతోపాటు గొర్రెలకు రూ.5000, పొట్టేలుకు రూ.7000 బీమాను కూడా ప్రభుత్వం అందిస్తున్నది. మొదటి, రెండు విడుతల్లో ఎంతో మంది లబ్ధి పొందారు. గొర్రెల ఉత్పత్తిలో రాజస్థాన్ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నీరు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజలు తలెత్తుకు జీవిస్తున్నారు. అన్ని రంగాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్దే.
– కుర్వ అంజిలప్ప, లక్ష్మీనారాయణపూర్, యాలాల
మాకు నలుగురు సంతానం.. అర ఎకరా పొలం ఉంది. పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం చాలాభారంగా ఉండేది. 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ద్వారా 21 గొర్రెలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం 70 గొర్రెలు అయ్యాయి. గత సంవత్సరంలో కూతురు పెళ్లి చేశాను. గొర్రెలపై జీవనాధారం సాగించడంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు గొర్రెలు ఇవ్వడంతో మా బతుకులు మారాయి. కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– గొల్ల వెంకటయ్య, పులుమద్ది, వికారాబాద్
షాబాద్, నవంబర్ 8 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం రాజేందర్రెడ్డి 68వ జయంతిని పురస్కరించుకుని షాబాద్, ముద్దెంగూడ, గొల్లూరుగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే యాదయ్య, జడ్పీటీసీ అవినాశ్రెడ్డిలతో కలిసి ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుల్పంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలో రాజేందర్రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందిన సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన నలాపురం మల్లారెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కులవృత్తులకు గుర్తింపు లభించింది. గొల్ల కురుమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకువచ్చిన సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం ఎంతో బాగుంది. ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కుల వృత్తులను అస్సలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ గొల్ల కురుమలకు సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పోటేలును అందిస్తున్నారు. గొర్రెల పంపిణీతో కులవృత్తులకు ఆదరువు లభించి గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నిండాయి. గొల్ల కురుమల కష్టాలను తెలుసుకొని గొర్రెలను అందిస్తున్న సీఎం కేసీఆర్కి రుణపడి ఉంటాం. అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్కే నా మద్దతు.
– చెన్న వెంకటేశ్, కడ్తాల్ మండలం
గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలు అందించడం గొప్ప పరిణామం. కులసంఘాలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం. ప్రభుత్వం అందించిన గొర్రెలతో గొల్ల కురుమలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
– అచ్చిని అంజయ్య, అంతిరెడ్డిగూడ (షాబాద్)