వికారాబాద్, మే 7, (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించగా, మరో వారం, పది రోజుల్లో గుంతలు తీసే ప్రక్రియను ప్రారంభించనున్నది. ఈసారి అటవీ శాఖ, డీఆర్డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 13.38 లక్షల మొక్కలు, 566 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మొక్కలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 2.15 లక్షల మొక్కలను నాటేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి పల్లెలోని నర్సరీలో సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా గ్రామంలో తక్కువ మొక్కలుంటే పక్క గ్రామం నుంచి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటాలని జిల్లాయంత్రాంగం నిర్ణయించింది. నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేయనున్నారు. గతేడాది 40.54 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 38.70 లక్షల మొక్కలను నాటినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధం చేస్తుంది. వచ్చేనెల రెండో వారం నుంచి హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా ఆ దిశగా జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేస్తుంది. మరో వారం, పది రోజుల్లో గుంతలు తీసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది నాటనున్న మొక్కలను బట్టి గుంతలను తీసి సిద్ధం చేయనున్నారు. అదేవిధంగా ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధంగా ఉంచారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు నిర్దేశించారు. అదేవిధంగా మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతి మొక్కను బ్రతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. అంతేకాకుండా హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. అదేవిధంగా గతేడాది నాటిన మొక్కల్లో 70శాతం మేర మొక్కలు బ్రతకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు కూడా చర్యలు చేపట్టారు. పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది టార్గెట్ 40.53 లక్షల మొక్కలు..
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అటవీ శాఖ, డీఆర్డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 13.38 లక్షల మేర మొక్కలు, 566 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మొక్కలు, మున్సిపాలిటీల పరిధిలో 2.15 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 11వేల మొక్కలు, డీపీవో, డీఆర్డీవో ఆధ్వర్యంలో 25 లక్షల మొక్కలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 5వేల మొక్కలు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 43,500 మొక్కలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 2 లక్షల మొక్కలు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 500 మొక్కలు, గనుల శాఖ ఆధ్వర్యంలో 50వేల మొక్కలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 500 మొక్కలు, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2వేల మొక్కలు, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 5వేల మొక్కలను నాటనున్నారు.
అదేవిధంగా 4 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 2.15 లక్షల మొక్కలను నాటనున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 80 వేల మొక్కలు, తాండూరు మున్సిపాలిటీలో 70,000 మొక్కలు, పరిగి మున్సిపాలిటీలో 30వేలు, కొడంగల్ మున్సిపాలిటీలో 35వేల మొక్కలను నాటేందుకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాటనున్న మొక్కలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 566 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆయా గ్రామాల్లోని నర్సరీల్లోని మొక్కలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే నాటనున్నారు, ఏదేని నర్సరీల్లో తక్కువ మొక్కలున్నట్లయితే పక్క గ్రామ పంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా గతేడాది 40.54 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 38.70 లక్షల మొక్కలను నాటినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ధారూరు, తాండూరు, అన్నాసాగర్, తట్టేపల్లి, కల్కొడ, వికారాబాద్ అటవీ ప్రాంతాల్లోనూ మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదం, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అనంతగిరి అడవుల్లో లక్ష మొక్కలను నాటనున్నారు.