ఈసారి యాసంగికి సాగునీటి తిప్పలు తప్పేటట్టులేవు. సరైన వర్షాలు కురువకపోవడంతో ఎన్నడూ లేనివిధంగా ఏడాది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులెవరూ పంటలను సాగు చేసే సాహసం చేయడంలేదు. ఓ వైపు నీటి కొరత.. మరోవైపు చేతిలో పెట్టుబడులకు డబ్బులు లేకపోవడంతో రైతాంగం భూములను పడావుగా ఉంచుతున్నది. రంగారెడ్డి జిల్లాలో గత యాసంగితో పోలిస్తే 40వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది. గతేడాది 1.20 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవ్వగా.. ఈసారి యాసంగిలో కేవలం 80వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-రంగారెడ్డి, జనవరి 4(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యాసంగికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో పంటలను సాగు చేసే పరిస్థితి లేకుండా పోతున్నది. ఓ వైపు నీటి కొరత.. మరోవైపు చేతిలో పెట్టుబడులకు డబ్బులు లేకపోవడంతో జిల్లా రైతాంగం భూములను పడావుగా ఉంచుతున్నది. గత యాసంగితో పోల్చితే 40వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. ఈసారి యాసంగిలో 80 వేల ఎకరాల్లోనే పంట లు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటివరకు 11 వేల ఎకరాల్లోనే రైతులు పం టల సాగును మొదలుపెట్టారు. గడిచిన పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదని రైతాంగం పేర్కొంటున్నది.
ఈ ఏడాది జూలై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వర్షాలు బాగానే కురిసినప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మా సాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఈ మూడు నెలల వ్యవధిలో మొత్తం 128.2మి.మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 23.7మి.మీటర్లు మాత్రమే కురిసిం ది. మొత్తంగా 81.5మి.మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది.గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో 5.02 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఈ ఏడాది 8.2 మీటర్ల లోతులోకి పడిపోయాయి. దీంతో బోర్లు, బావుల్లో నీటి మట్టాలు అడుగంటి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీటి కారణంగా ఆయా ప్రాంతాల్లోనే పంటల సాగు ఆశాజనకంగా ఉంది.
గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 1,23,239 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. అయితే ఈసారి సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి సీజన్లో 80,932 ఎకరాల్లోనే పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అం చనా వేస్తుండగా..ఆ మేరకు కూడా పం టలు సాగయ్యే పరిస్థితి కనిపించడంలేదు. వరి సాగు కు ఇంకా సమయం ఉన్నప్పటికీ మిగతా పంటల సాగును సైతం రైతులు నేటివరకు మొదలుపెట్టలేదు. యాసంగి సీజన్ మొదలై నెల రోజులు కా వొస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు కేవలం 11,224 ఎకరాల్లోనే పంటలు సాగయ్యా యి.
పెట్టుబడులకు రైతుల చేతిలో డబ్బుల్లేకపోవడం వల్లనూ రైతులు పంటల సాగుకు సాహసించడం లేనట్లు తెలుస్తున్నది. రైతుబంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం యాసం గి సీజన్కు రూ. 378.92 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉం డగా..ఇప్పటివరకు కేవలం రూ. 35.66 కోట్లను మాత్రమే జమ చేసింది. పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే వచ్చింది. ఈ కారణంగానూ రైతులు సాగుకు ఉపక్రమించే పరి స్థితులు కనబడడం లేదు. చాలామంది రైతులు భూములను పడావుగా నే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో గత వానకాలం వరకు పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు బీడుపడి పోయి కన్పించనున్నాయి.
గతేడాది కంటే ఈ ఏడాది పంటల సాగు తగ్గుతున్నది. గతంలో బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతోపాటు పంటల సాగుకు అప్పటి ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు అదునుకు ముందు గా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని జమ చేసేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరంలోపే పెట్టుబడి సాయాన్ని అందిం చింది. మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటుతుండడంతో బోరుబావుల్లోనూ నీరు తగ్గుతున్నది. దీంతో గతేడా దితో పోల్చితే సగం వరకు వరి, ఇతర పంటల సాగు తగ్గుతున్నది.
-అంజయ్య, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వెంటనే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. పంట సాయం రాకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానకాలంలో సరిగ్గా వానలు పడకపోవడంతో పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉన్నది. యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరం వరకే పెట్టుబడి సాయాన్ని అందించింది. ఎకరా కంటే ఎక్కువ ఉన్న వారికి రైతుబంధు బ్యాంకులో జమ కాకపోవడంతో రైతులు పైసల్లేక ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఠంఛన్గా పెట్టుబడి సాయాన్ని అందించేవారు.
-చేగూరి మహేశ్, యువ రైతు, కడ్తాల్
ఇప్పటివరకూ రైతుబంధు పెట్టుబడి సాయం పడలేదు. దీని కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వానకాలంలో కొద్దిగా వరిని నాటు వేశా. ప్రస్తుతం ఉపాధి హామీ పనికిపోతున్నా. గత యాసంగిలో కొద్ది గా పొలం సాగైంది. వానలు సరిగ్గా పడకపోవడంతో ఇప్పుడు పంట సాగు అవుతుందనే నమ్మకంలేదు. ఉన్న భూమిలో ఆరుతడి పంటలను సాగు చేద్దామని అనుకుంటున్నా.
– తీగపురం కృష్ణయ్య, రైతు, వీర్లపల్లి గ్రామం, నందిగామ