కాలం నీతో నడవదు..నిన్ను అడిగి ముందుకు సాగదు..
సంకల్పం ఒకటే చాలదు.. సమయమే కదరా ఆయుధము
విజయం నేరుగా చేరదు.. శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గంలో.. ప్రతి సెకను విలువని తెలుసుకో..
ఉదయం ఐదు గంటల నుంచే వందలాది మంది యువతీ, యువకులతో మున్సిపల్ గ్రౌండ్ నిండిపోతున్నది. ఎముకలు కొరికే చలి, మంచు దుప్పటి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు వారి పసి పిల్లలను చంకలోఎత్తుకొని సాధనకు వస్తున్నారు. పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
– బడంగ్పేట, డిసెంబర్ 12
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కొలువులను బర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది. రాత పరీక్షలు సైతం నిర్వహించింది. ప్రస్తుతం పోలీ సు ఉద్యోగం కోసం రాత పరీక్షల్లో అర్హత సాధించిన సుమారు 250 నుంచి 300 వరకు మహిళలు, పురుషులు ఈవెంట్స్లో అర్హత సాధించడానికి బడంగ్పేట మున్సిపల్ గ్రౌండ్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సాధన చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పురుషులతో సమానంగా గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు.
ప్రాక్టీస్ కోసం వస్తున్న కొంతమంది భార్యాభర్తలు వారి పిల్లలను సైతం వారివెంటనే గ్రౌండ్కు తీసుకువస్తున్నారు. గ్రౌండ్ నుంచే నేరుగా స్కూల్కు పంపిస్తున్నారు. మరికొందరు భర్త ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భార్య పిల్లలను ఎత్తుకుంటుండగా.. భార్య ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భర్త పిల్లలను ఆటలు ఆడిస్తూ కనిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ పిల్లలతో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గర్భిణులు సైతం పోలీసు కొలువు కోసం సాధన చేస్తున్నారు. కోచ్లు క్రమం తప్పకుండా మెళకువలు నేర్పిస్తున్నారు. అయితే మహిళలకు ప్రతి రోజు గుడ్లు, పాలు, పండ్లు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఈ వెంట్స్ కోసం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు సాధన చేస్తున్నారు. 300 మందికి పైచిలుకు గ్రౌండ్కు వస్తున్నారు. కొంత మంది గర్భిణులు కూడా పోలీస్ ఉద్యోగం సాధించడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరికీ ఉచితంగానే శిక్షణ ఇస్తున్నాం.
– ఎనుముల కొండల్ రెడ్డి, కోచ్
ఉదయం ఐదు గంటలకే గ్రౌండ్కు వస్తున్నాం. ఇద్దరం ప్రాక్టీస్ చేస్తుండటంతో మా పిల్లలను సైతం మాతోనే తీసుకువస్తున్నాం. ఉదయం 9 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. రెండు నెలలు కష్టపడితే జీవితంలో స్థిర పడుతామనే నమ్మకం ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– మనీష, కర్మన్ఘట్