వికారాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నది. కిరాణా దుకాణాల కంటే ఎక్కువగా మద్యం దుకాణాలున్నాయి. జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో వేసవి కాలంలో తాగునీటి కష్టాలు వస్తాయేమోకాని మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండడం గమనార్హం. మద్యానికి బానిసలై ఎంతోమంది పేదల బతుకులు ఆగమవుతున్నప్పటికీ జిల్లా ఎక్సైజ్, పోలీసు యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఎక్సైజ్ శాఖతోపాటు పోలీసులకు ప్రతినెలా మామూళ్లు వస్తుండడంతో బెల్టుషాపుల నిర్వహణను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో సారా రక్కసి సమూలంగా పోయినప్పటికీ మద్యం ఏరులై పారుతున్నదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకట్రెండు గ్రామాల్లో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటిస్తున్నప్పటికీ మెజార్టీ గ్రామాల్లో మద్యం అమ్మకాలు మాత్రం ఆగడంలేదు. జిల్లాలో గతేడాది 59 మద్యం దుకాణాల్లో 7.77 లక్షల లీటర్ల మద్యం విక్రయాలతో రూ.715 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 3.74 లక్షల లీటర్ల మద్యం విక్రయాలతో రూ.349 కోట్ల ఆదాయం వచ్చింది.
మామూళ్లు అందడంతో చూసీచూడనట్లు..
జిల్లావ్యాప్తంగా కేవలం 59 లైసెన్స్డ్ మద్యం దుకాణాలుండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించే బెల్టు షాపులు సుమారు 2 వేలకుపైగా ఉన్నాయి. ఒకటి రెండు మినహా మిగతా కిరాణా దుకాణాల్లోనే బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్కు ఎదురుగా ఉన్న కిరాణా దుకాణాల్లో తెల్లవారుజాము నుంచే బహిరంగంగానే మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఎక్సైజ్తోపాటు పోలీసులకు తెలిసినా మామూళ్లతో సరిపెట్టుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగితే తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు తదనంతరం ఎలాంటి కేసులు లేకుండా వదిలేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పోలీసు, ఎక్సైజ్ అధికారుల అండదండలతో గ్రామాల్లో యథేచ్ఛగా బెల్టు షాపులు కొనసాగిస్తున్నారు. మరోవైపు బెల్టు షాపుల్లో రూ.20 నుంచి రూ.50 వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాల ద్వారా 40 శాతం మేర విక్రయాలు జరుగుతుండగా.. బెల్టు షాపుల ద్వారా 60 శాతం మేర జరుగుతుండడం గమనార్హం.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
గ్రామాల్లో బెల్టు షాపుల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఎవరూ ఫిర్యాదు చేసినా తప్పనిసరిగా స్పందించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేస్తే బెల్టు షాపులను మూసివేస్తాం.
– విజయ్భాస్కర్గౌడ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్