వికారాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఏదో ఒక ప్రాం తంలో చోరీ కేసు నమోదవుతూనే ఉన్నది. చోరులు పక్కా ప్లాన్తో దోచుకెళ్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వికారాబాద్, తాం డూరు పట్టణాల్లోనే అధికంగా దొంగతనాల కేసులు నమోదవుతున్నా పోలీసులు సరిగ్గా నిఘా పెట్టడంలేదనే ఆరోపణలున్నాయి.
ఎక్కడైనా చోరీ జరిగితే ఆ ప్రాంతంలో రెండు, మూడు రోజులపాటు రాత్రిళ్లు గస్తీ నిర్వహించడం తదనంతరం పట్టించుకోకపోవడంతో పోలీసుల కండ్లు గప్పి చోరీలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. పోలీసుల నిర్లక్ష్యంతోనే జిల్లాలో దొంగతనాలు, చైన్స్నాచింగ్లు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలనే టార్గెట్గా చేసి కొందరు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీ లు, చైన్స్నాచింగ్ కేసులపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది.
రెండు, మూడు రోజులు సెలవులొస్తున్నాయంటే ఆ సమయంలోనే చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఏ ఇంటికి తాళం ఉందనేది గుర్తించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. దొంగలు రైళ్లలో వచ్చి వికారాబా ద్, తాండూరు పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. వరుస చోరీలు, చైన్స్నాచింగ్లపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రివేళల్లో గస్తీ నిర్వహించాల్సిన కొందరు పోలీసులు కేవలం మూసివేయని హోటళ్లు, దుకాణాల వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు తప్ప కాలనీల్లో గస్తీ నిర్వహించడంలేదని పలువురు మండిపడుతున్నారు. పట్టణాల్లోని కాలనీ లు, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఒకట్రెండు సార్లు పెట్రోలింగ్ నిర్వహిస్తే చాలావరకు చోరీలు తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు.
1. వారం రోజుల కిందట వికారాబాద్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్సేంజీ సమీపంలో బసమ్మ అనే వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఇద్దరు దుండగులు ఒకటిన్నర తులాల బంగారాన్ని తస్కరించారు.
2. కులకచర్ల మండలంలోని పాండవులబండ గ్రామంలో వృద్ధురాలిని హత్య చేసి మూడు తులాల బంగారం, పట్ట గొలుసులు, కడెలను అపహరించుకుపోయారు.
3.వికారాబాద్ పట్టణంలోని సిండికేట్ బ్యాంకు వద్ద స్వరూప అనే వృద్ధురాలి నుంచి ఒకటిన్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
4. తాండూరు పట్టణంలోని తులసీనగర్లో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించారు.
5. గత నెలలో తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఒకే రోజు ఏడు ఇండ్లలో భారీ చోరీ జరిగింది.
6. గత నెలలో వికారాబాద్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే స్కూటీని, అదేవిధంగా ఆటోను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.
7. ఏడాది కిందట తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిపూర్లో ఓ ఇంట్లో 45 తులాల బంగారంతోపాటు అదే రోజున తాండూరు మున్సిపాలిటీ పరిధిలోనే 17 తులాల బంగారం, రూ.5 లక్షల దోచుకెళ్లారు. ఏడాది దాటినా ఇంకా కేసును పోలీసులు ఛేదించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.