షాబాద్ : ఎంపీడీవో కార్యాలయంలో చోరీకి గురైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం స్లాబ్ పై నుంచి లోపలికి ప్రవేశించి తాళాలు పగులగొట్టి అందులో ఉన్న బీరువా తాళాలు ధ్వంసం చేశారు. కార్యాలయానికి సంబంధించిన పేపర్లు తప్ప ఏమి దొరకకపోవడంతో అలాగే వదిలిపెట్టి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం కార్యాలయం తెరిచి చూసిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని ఎంపీడీవో అనురాధకు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ఆశోక్ దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని, త్వరలో దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక జడ్పీటీసీ అవినాశ్రెడ్డి కార్యాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.