Misir Besra : దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు (Most Wanted Maoist) నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సీపీఐ (మావోయిస్టు) పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రా (Misir Besra) ఎట్టకేలకు భద్రతా బలగాలకు చిక్కాడు. ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండటం గమనార్హం. జార్ఖండ్ (Jarkhand) లో జరిగిన సంయుక్త ఆపరేషన్ (Joint Operation) లో ఆయనతోపాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో ఇది అత్యంత కీలక విజయాల్లో ఒకటిగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి జార్ఖండ్ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్), కోబ్రా బెటాలియన్ సంయుక్తంగా ధన్బాద్, గిరిడిహ్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మిసిర్ బేస్రా సంచారంపై అందిన నిఘా సమాచారంతో ఉచ్చువేసిన బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్టు రీజినల్ కమిటీ సభ్యులు మెహనత్ అలియాస్ మొచ్చు, విభీషణ్ ముర్ము, గౌరవ్ అలియాస్ సౌరభ్లను కూడా అరెస్ట్ చేశారు.
వీరిద్దరి తలపై చెరో రూ.15 లక్షల రివార్డు ఉంది. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారికి మావోయిస్టు సంస్థతో ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. అరెస్టయిన నేతల నుంచి సంస్థ కార్యకలాపాలు ఆయుధాల నిల్వలు, నిధుల సమీకరణ మార్గాలు, వ్యూహాలు, కీలక అనుచరులపై సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు భద్రతావర్గాలు తెలిపాయి. ఈ అరెస్టులకు ముందు రాంచీలో మంగళవారం 16 మంది మావోయిస్టు కేడర్ సభ్యులు అధికారుల ఎదుట లొంగిపోయారు.
వారిలో మిసిర్ బేస్రాకు అత్యంత సన్నిహిత అంగరక్షకుడిగా పనిచేసిన దేవన్ ముర్ము అలియాస్ శనిచర్వా కూడా ఉన్నాడు. అతడి నుంచి లభించిన కీలక సమాచారమే ఈ ఆపరేషన్కు దారితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమాచారంతో పక్కా ప్రణాళిక రూపొందించి మిసిర్ బేస్రాను పట్టుకున్నట్లు చెప్పారు. జార్ఖండ్లోని గిరిడిహ్ జిల్లా పిర్తాండ్ ప్రాంతానికి చెందిన మిసిర్ బేస్రా దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. భాస్కర్, సునిర్మల్, సాగర్ పేర్లతో కూడా ఆయన గుర్తింపు పొందాడు. క్రమంగా సీపీఐ (మావోయిస్టు) అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎదిగాడు.
జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో హత్యలు, భద్రతా బలగాలపై దాడులు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఇలా 150 కి పైగా కేసులు ఆయనపై నమోదైనట్లు సమాచారం. 2007లో ఖుంటీ పోలీసులు మిసిర్ బేస్రాను అరెస్ట్ చేసినా 2009లో బీహార్లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసిన సమయంలో ఆయన పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతాబలగాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు.