Pavala Syamala | టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలకు నేడు (జులై 29) అంతిమ వీడ్కోలు పలకనున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల పాటు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణం చిత్రసీమను విషాదంలో ముంచెత్తింది. నేడు హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమంలో ఉంచిన పావలా శ్యామల పార్థివదేహాన్ని ఉదయం మహాప్రస్థానానికి తరలించనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె భౌతికకాయం మహాప్రస్థానానికి చేరుకోగా, సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పించేందుకు దాదాపు గంటపాటు అక్కడే ఉంచనున్నారు.
ఉదయం 11 గంటల తర్వాత నుంచి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రతినిధులు, పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై పావలా శ్యామలకు తుది వీడ్కోలు పలకనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెల్లవారుజామున 1.52 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1984లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఛాలెంజ్’ సినిమాతో పావలా శ్యామల తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం దాదాపు 100కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించారు. కుటుంబ కథా చిత్రాలు, హాస్యభరిత పాత్రలు, భావోద్వేగ సన్నివేశాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, చివరిసారిగా 2019లో విడుదలైన ‘మత్తు వదలరా’ చిత్రంలో కనిపించారు. 2014 నుంచి పావలా శ్యామల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన కుమార్తెతో కలిసి అత్యంత నిరాడంబరంగా జీవిస్తూ చికిత్స కోసం కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆమె పరిస్థితి గురించి తెలిసిన పలువురు సినీ ప్రముఖులు గతంలో ఆర్థిక సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. పావలా శ్యామల మృతిపై తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తూ దర్శకుల సంఘం ట్రస్ట్ తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వ్యక్తిగతంగా మరో రూ.50 వేల విరాళం అందించారు. మొత్తంగా రూ.1 లక్ష సాయాన్ని దర్శకుల సంఘం ప్రకటించింది.