ఇబ్రహీంపట్నం, జనవరి 10: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు తయారుచేసిన 321 ప్రయోగాలను ప్రదర్శించారు. మంగళ, బుధవారాల్లో జరిగిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 2 వేలమందికిపైగా విద్యార్థిని, విద్యార్థులు తిలకించారు. దీంతో గత రెండ్రోజులుగా గురుకుల విద్యాపీఠం పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొన్నది.
ఈ ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన సక్సెస్ఫుల్ అయ్యింది. విద్యార్థిని, విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యం పెంపొందించడంతోపాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భావి సైంటిస్టులుగా మార్చేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రదర్శనకు గత రెండ్రోజులుగా విచ్చేసిన విద్యార్థిని, విద్యార్థులకు గురుకుల విద్యాపీఠంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. బుధవారం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. రెండ్రోజులపాటు విద్యార్థిని, విద్యార్థులు ఏర్పాటుచేసిన ప్రయోగాలను పలువురు సైంటిస్టుల బృందం పరిశీలించింది. అనంతరం సమాజానికి ఉపయోగపడే శాస్త్రీయ నైపుణ్యం కలిగిన ప్రదర్శనలను ఎంపిక చేసి, బహుమతులు కూడా అందజేశారు.
రెండ్రోజులపాటు గురుకుల విద్యాపీఠంలో 321 ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో 41 జిల్లా పరిషత్ స్కూళ్లు పాల్గొనగా.. 155 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. 9 మండల పరిషత్ పాఠశాలలు.. 29 ప్రదర్శనలు ఏర్పాటుచేశాయి. 2 గురుకుల పాఠశాలలు పాల్గొనగా.. 4 ప్రదర్శనలు ఏర్పాటుచేశాయి. 2 కేజీబీవీలు పాల్గొని 3 ప్రదర్శనలు ఏర్పాటుచేశాయి. 25 ప్రైవేటు పాఠశాలలు పాల్గొనగా.. 89 ప్రయోగాలను ప్రదర్శించారు. మొత్తంగా 79 పాఠశాలలకుగాను 280 ప్రయోగాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయుల నుంచి 3 ప్రదర్శనలు, సెమినార్ల నుంచి 38 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మొత్తం 321 ప్రయోగాలను ప్రదర్శించారు.
ముగింపు కార్యక్రమంలో డీఈవో సుశీందర్రావు విద్యార్థుల్లో సృజనాత్మకత, మేథాశక్తికి ప్రతిరూపమే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రాజీరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ రామచంద్రారెడ్డి, మండల విద్యాధికారి వెంకట్రెడ్డి, కృష్ణ. విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలుగా ఎంపికైన వారిలో లాట్స్ హైస్కూల్ విద్యార్థులు యశస్వినిరెడ్డి, అశోక్కుమార్, పాలుమాకులలోని మైనార్టీ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు కిరణ్, అక్బర్ఖాన్, కుర్మిద్ద జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు చరణ్తేజ, పాండురంగారెడ్డి, చంపాపేట్ హైస్కూల్ విద్యార్థులు అక్షరరెడ్డి, సౌజన్య, చేవెళ్లలోని టీఎస్ఎంస్ విద్యార్థులు సాయిగాయత్రి, సుజాత, ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠం హైస్కూల్ విద్యార్థి అక్షయ దీపక్కుమార్, హయత్నగర్లోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు శివచరణ్, భాస్కర్, అహ్మడాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు శ్రీనిధి, నాగేశ్బాబు, ఇబ్రహీంపట్నం జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు నిఖిత, ఉమాదేవి ఉన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలతో విజ్ఞానం పెరుగుతుంది. ఇలాంటి జిల్లా స్థాయి ప్రదర్శనలతో మా లాంటి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరగడంతోపాటు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలుంటుంది.
– మనీశ్, టీఎస్ఎంఎస్, పాలమాకుల
శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఓ ప్రయోగశాలను ఏర్పాటుచేయాలి. వీటితో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇలాంటి ప్రదర్శనా క్షేత్రాల వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.
– పవన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంపట్నం
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలను సద్వినియోగం చేసుకున్నాం. వీటిలో అనేక రకాల విషయాలు తెలుసుకున్నాం. ప్రదర్శనా క్షేత్రాలు నాలాంటి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలి
– యశస్విని, బాలికల ఉన్నత పాఠశాల, రాగన్నగూడ