రైతు బంధు సాయం పంపిణీ కొనసాగుతుండగా.. రైతులు పంటల సాగు పనులు సంబురంగా చేసుకుంటున్నారు. శుక్రవారం నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 2,69,797 మంది రైతులకు రూ.118.54 కోట్లు అందించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,15,508 మందికి రూ.176.61కోట్లు అందాయి. కాగా, రైతులు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం ఖర్చుపెడుతున్నారు. సకాలంలో లాగోడి అందించి అప్పు చేసే బాధలు తీర్చిన సీఎం కేసీఆర్కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం ప్రభుత్వం నాలుగెకరాల్లోపు వారికి రైతుబంధు డబ్బులు జమ చేసింది. జిల్లాలో నాలుగెకరాల్లోపు ఉన్న 26,701 మంది రైతులకు రూ.45,44,58,868 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,15,508 మంది రైతులకు రూ.176,61,14,492 జమ చేసింది. వానకాలం సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ.20 వేలు జమ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. వ్యవసాయ అధికారులు కంది విత్తనాలను ఉచితంగా అందజేస్తుండటంతో రెట్టింపు ఆనందంతో సాగు పనుల్లో బిజీ అయ్యారు.