కడ్తాల్, డిసెంబర్ 30 : విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండలంలోని 34 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బోధనోపకరణ మేళాను నిర్వహించారు. టీఎల్ఎం మేళాకు ముఖ్యఅతిథులుగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు గణితం, సైన్స్, తెలుగు ఆంగ్లం తదితర సబ్జెక్ట్లను అర్థమయ్యే విధంగా, వివిధ రకాల పరికరాలతో విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా ప్రదర్శనలో ఉపాధ్యాయులు చేసి చూయించారు. స్టాళ్లల్లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తిలకించారు.
ఈ సందర్భంగా ఎంఈవో సర్దార్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు 1092 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగా ఏడాదికి ఒక్క విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉన్నదని, విద్యార్థులకు ప్రయోగాల ద్వారా విద్యనందించడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఎంపీ అభినందించారు. రాష్ట్రంలో మెడికల్ విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిందన్నారు.
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సర్కార్ బడులకు నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యనందించడానికి టీఎల్ఎం మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
బోధనోపకరణ పద్ధతిలో విద్యను సులభతరంగా బోధించవచ్చని పేర్కొన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.7,300 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం బోధనోపకరణ మేళాలో ఉత్తమంగా ప్రదర్శనలిచ్చిన పాఠశాలలను ఎంపిక చేశారు. మక్తమాదారం, పుల్లేరుబోడుతండా, సాలార్పూర్, రేఖ్యాతండా, రావిచేడ్ ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు గణితం, ఆంగ్లం, తెలుగు, పరిసరాల విజ్ఞానం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వారికి ఎంపీ, ఎమ్మెల్సీలు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్, మనోహర, వైస్ ఎంపీపీ ఆనంద్, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు హరిచంద్నాయక్, సులోచన, శంకర్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, భాస్కర్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, భిక్షపతి, జహాంగీర్అలీ, లాయక్అలీ, నర్సింహ, కృష్ణ, శేఖర్గౌడ్, నరేశ్నాయక్, సుమన్, లక్పతినాయక్, వెంకటేశ్, రాఘవేందర్, శేఖర్, లక్ష్మయ్య, మహేశ్, యాదయ్య, హెచ్ఎంలు జంగయ్య, విజయ, ఎస్సీఈఆర్టీ అధికారులు సువర్ణవినాయక్, రవిప్రకాశ్, ఎస్ఆర్ఈజీ అధికారులు శేషు, సైదిరెడ్డి, లక్ష్మీనర్సింహారావు, ఏఎంవో వెంకటేశ్, సీఎంవో కృష్ణయ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.