ఇబ్రహీంపట్నం, మే 15 : హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫిష్మార్కెట్ అటకెక్కింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారుల కోసం ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో చేపపిల్లల పెంపకం కేం ద్రాన్ని గత 60 ఏండ్ల కిందట ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ఏటా జిల్లాలోని ప్రధాన చెరువులతోపాటు మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేసేవారు. కాగా, ఇటీవల అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేపల పెంపక కేంద్రాన్ని కూల్చివేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని చెరువులకు ఇక్కడే సరిపడా చేపపిల్లలను పెంచి మత్స్యశాఖ ఆధ్వర్యంలో గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించింది. జీవనోపాధి పొందిన రైతులు ఒక్కసారిగా చేపపిల్లల పెంపక కేంద్రాన్ని కూల్చివేయటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేసిన చేపపిల్లల పెంపక కేంద్రాన్ని ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మత్స్యకారులతో కలిసి పరిశీలించారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని.. వెంటనే ఇబ్రహీంపట్నంలో చేపపిల్లల పెంపక కేంద్రాన్ని పునర్నిర్మించాలని మత్స్యకారులు, రైతులు కోరుతున్నారు.
చేపల మార్కెట్ ఏర్పాటుకు రూ.2 కోట్లు మంజూరు..
ఇబ్రహీంపట్నం శేరిగూడ సమీపంలో ఉన్న చేప పిల్లల పెంపక కేంద్రం సమీపంలో రాంనగర్ తరహాలో ఫిష్మార్కెట్ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ మార్కెట్కు అప్పటి మత్స్యశాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శంకుస్థాపన కూడా చేశారు. కానీ, ప్రభుత్వం మారటంతో పిష్మార్కెట్ పనులు ప్రారంభించలేదు. జిల్లావ్యాప్తంగా నాలుగు కోట్ల పైచిలుకు చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆయా సొసైటీల పరిధిలోని చెరువుల్లో పెంచేందుకు కేటాయించారు.
వాటిని విక్రయించేందుకు ఇబ్ర హీంపట్నం చెరువు సమీపంలో సుమారు రూ.2 కోట్లతో అన్ని హంగులతో పిష్మార్కెట్ను నిర్మిస్తే మత్స్యకారులు, కొనుగోలు దారులకు అనుకూలంగా ఉంటుందని గత ప్రభుత్వం భావించింది. కానీ, ప్రభుత్వం మారడంతో మార్కెట్ నిర్మాణం అటకెక్కింది. ఇబ్రహీంపట్నంతోపాటు తుర్కయాంజాల్, రాగన్నగూడ, బొంగ్లూర్, యాచారం, మాల్, తదితర ప్రాంతాల్లో ఆదివారం, ఇతర రోజుల్లో రోడ్లపైనే చేపలను విక్రయిస్తున్నారు. సర్కార్ స్పందించి ఫిష్ మార్కెట్ను త్వరగా ఏర్పాటు చేయాలని వ్యాపారులు, రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.
పనులు ప్రారంభించాలి
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయడంతోపాటు భూమిపూజ చేసింది. కానీ, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ఈ నిర్మాణానికి గాలికొదిలేసింది. ప్రభుత్వం మత్స్యకారులను దృష్టి లో ఉంచుకుని ఇప్పటికైనా చేపల మా ర్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించాలి.
-నీలం బాలు
చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని వెంటనే పునర్నిర్మించాలి..
ఇబ్రహీంపట్నం సమీపంలోని పెద్దచెరువు కింద గత 60 ఏండ్ల కిందట నిర్మించిన చేపపిల్లల పెంపకం కేంద్రం ఈ ప్రాంత మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి మెరుగుపర్చింది. ఇక్కడ పెంచిన చేప పిల్లలను తమ చెరువుల్లో వదిలేందుకు మత్స్యకారులు తీసుకెళ్లేవారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కూల్చివేసిన చేపపిల్లల పెంపక కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించాలి.
-జెర్కోని రాజు